హలధారుల సంబురాలు అంబరమంటుతున్నాయి. పల్లెల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. రైతుబంధు కింద యాసంగి పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాల్లో జమవుతుండడంతో అన్నదాతల ఆనందం అంతాఇంతా కాదు. ఉమ్మడి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రైతులు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. విద్యార్థులకు పోటీలను నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. పలుచోట్ల ప్రత్యేక పశువైద్య శిబిరాలను నిర్వహించారు. రైతుబంధు వారోత్సవాలు ఉమ్మడి జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. రైతుబంధు రంగవల్లులతో రైతువేదికలు, విద్యాసంస్థల వాకిళ్లు కళకళలాడుతున్నాయి. దీంతో ఊరూరా పండుగ సందడి నెలకొంటున్నది. శుక్రవారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని రైతువేదికల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రైతులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ‘రైతుబాంధవుడు సీఎం కేసీఆర్.. జయహో’అంటూ నినదించారు. పాఠశాలల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పలుచోట్ల పశువైద్య శిబిరాలను నిర్వహించారు.