దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన దళితులను ఆర్థికంగా నిలబెట్టాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు సంపదను సృష్టించి, సుసంపన్నులుగా ఎదుగాలని ఆకాంక్షించారు. చివ్వెంల మండలం తుల్జారావుపేటలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి మంత్రి జగదీశ్రెడ్డి సోమవారం దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకుఅనుగుణంగా పాలన సాగుతున్నదని, జనం ఏమైతే కోరుకున్నారో వాటన్నింటినీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
చివ్వెంల, మే 9 : దళితులను ఆర్థికంగా సుసంపన్నం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు యూనిట్లను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి సోమవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తుల్జారావుపేటలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందన్నారు. ప్రజలు ఏమైతే కోరుకున్నారో అవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని తెలిపారు.
నేడు దళితబంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించి తద్వారా సమాజంలో ధనవంతులుగా ఎదుగాలని ఆకాంక్షించారు. వాహనాలు అందుకున్న లబ్ధిదారులు డ్రైవింగ్ సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, ఆర్థిక వనరులను పెంచుకోవాలని సూచించారు. డెయిరీ, షీప్ పథకాలు పొందిన లబ్ధిదారులు పశుగ్రాసం పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా డెయిరీ, షీప్, ట్రాక్టర్, మినీ వాహనాలు అందించారు. లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు.
అనంతరం గొర్రెల షెడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తుల్జారావుపేట, దురాజ్పల్లి, గుంజలూరు, జి. తిరుమలగిరి, వల్లభాపురం, ఉండ్రుగొండ, మోదిన్పురం, తిమ్మాపురం గ్రామాలకు చెందిన 51 కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. జాతీయ రహదారి-65 నుంచి తిమ్మాపురం, బి.చందుపట్ల వరకు 3 కిలోమీటర్ల మేర రూ.2కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. జి.తిరుమలగిరిలో జరుగుతున్న గుర్రప్పస్వామి, గంగదేవమ్మ జాతరలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ధరావత్ కుమారీబాబూనాయక్, జడ్పీటీసీ భూక్యా సంజీవ్నాయక్, వైస్ఎంపీపీ జూలకంటి జీవన్రెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీధర్, తాసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ లక్ష్మి, సర్పంచులు పాల్గొన్నారు.