తిరుమలగిరి, డిసెంబర్ 19 : షుగర్, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ముసురుతున్న తరుణంలో ప్రజల ఆహార అలవాట్లలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సేంద్రియ ఉత్పత్తులతో పాటు బలాన్నిచ్చే సంప్రదాయ ఆహారం వైపు అడుగులు వేస్తున్నారు. రోజువారీ ఆహారంలో పాల పదార్థాలు, చక్కెర, బియ్యం, జంక్ఫుడ్కు స్వస్తి పలికి రెండు తరాలకు పూర్వం ఉపయోగించిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. గతంలో జొన్నన్నం, జొన్న రొట్టె, జొన్న సంకటి ఎక్కువగా తీసుకునేవారు. దాంతో ఆ తరం వాళ్లు నేటికీ ఎలాంటి వ్యాధులు లేకుండా బలంగా ఉంటున్నారు. ఇటీవల జొన్నల వాడకం పెరిగిన నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలో జొన్న సాగు పెరిగింది. 135ఎకరాలకు పైగా సాగవుతున్నది. ముఖ్యంగా తండాల్లో జొన్న సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతున్నది.
గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా జొన్నరొట్టె, గట్క కేంద్రాలు వెలుస్తున్నాయి. వైద్యులు సైతం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తుండటంతో జొన్నలకు గిరాకీ పెరిగింది. క్వింటా జొన్నలకు ప్రభుత్వ రూ.2,758 మద్దతు ధరను ప్రకటించింది. దాంతో వ్యాపారులు అంతకు మించి చెల్లించి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. తిరుమలగిరి మండలంలో 55 ఎకరాల్లో జొన్న సాగు చేస్తున్నారు. మండల కేంద్రంలోని నెల్లిబండతండాతో పాటు మండలంలోని గుండెపురి, సిద్ధిసముద్రం, ఈదులపర్రెతండా, మామిడాల, వెలిశాల, జలాల్పురం, మర్రికుంటతండా, కన్నారెడ్డికుంటతండా, పంచాయతీలతో పాటు గిరిజన ప్రాంతాల్లో జొన్న సాగు చేస్తున్నారు. జొన్న పంట ప్రకృతి సిద్ధంగా పండుతుంది. రసాయన ఎరువుల వాడకం ఉండదు. పెంటమట్టి, చెరువు మట్టితో పండిస్తారు.
పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ…
జొన్న సాగుకు పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ. విత్తనాలు, దున్నటం తప్ప పెట్టుబడి ఉండదు. ఎకరానికి కిలో విత్తనాలు, దుక్కి దున్ని విత్తనాలు వేయటానికి రూ.2వేల పెట్టుబడి అవుతుంది. ఎరువుల వాడకం ఉండదు. ఎకరాకు దిగుబడి 8 నుంచి 10 క్వింటాళ్లు.. అంటే రూ.20 వేల ఆదాయం వస్తుంది. దాంతో రైతులు ఇతర పంటల్లో భాగంగా జొన్నసాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. యాసంగిలో వరి ధాన్యాన్ని కొనబోము అని కేంద్రం ప్రకటించడంతో జొన్నసాగు ఈ సారి పెరిగింది.
పశువులకు మంచి మేతగా జొన్న సొప్ప..
జొన్న సొప్ప పశువులకు మేతగానూ ఉపయోగపడుతుంది. ఎకరం జొన్న చేను సొప్ప విక్రయిస్తే రూ. 5 వేలకు పైగానే ఆదాయం వస్తుంది. యంత్రాలతో దున్ని సాగుచేసినా… సొప్పతో పెట్టుబడి ఖర్చులు తీరుతాయి. యాసంగిలో జొన్న సాగు అన్ని రకాలుగా మేలు చేస్తుందని రైతులు చెప్తున్నారు.
ఈ ఏడాది ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.2,758 ఉండగా వ్యాపారులు రూ.4వేలు చెల్లిస్తున్నారు.
ఎకరంలో జొన్న వేసినం..
మాకు రెండెకరాలు ఉన్నది. యాసంగిలో ఎకరం జొన్న సాగు చేశాను. చేను బాగానే ఉంది. ఎకరానికి 10క్వింటాళ్ల దిగుబడి వచ్చేటట్టుంది. వరికి బదులు ఏ పెట్టుబడి లేకుండా హాయిగా జొన్నలు వేసుకున్నం. ఇంకో 15 రోజులైతే పంట చేతికొస్తుంది. ఉదయం, సాయంత్రం పక్షులు రాకుండా కావలి కాస్తున్నా. ఇంటి మందం ఉంచుకోని మిగిలింది అమ్ముకుంటాం. మా తండాలోనే కొనటానికి తయారుగా ఉన్నరు. బయటకు పోయి అమ్ముకునే అవసరం కూడా లేదు.
జొన్న ఆహారంతో రోగనిరోధక శక్తి పెంపు…
జొన్న ఆహారం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం నిత్యం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు లేకపోవడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నాం. ఎలాంటి మందులు వాడకుండా పండించడంతో ఆహారం, ఆరోగ్య పరంగా జొన్న ఎంతో మేలు చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధం అని చెప్పొచ్చు.