90ఏండ్ల వయస్సు.. ముని మనమళ్లతో ఆడుతూ, పాడుతూ గడుపాల్సిన సమయం.. కానీ, ఆ దంపతులకు వ్యవసాయంపై ప్రేమ. మట్టిపై మమకారం. తెల్లవారింది మొదలు మలి సంధ్య దాకా చేను పనుల్లో చురుకుగా సాగుతున్నారు. ముగ్గురు కొడుకులూ వ్యవసాయం వదిలేసి హైదరాబాద్లో ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నారు. ‘ఎవరికైనా కౌలుకు ఇచ్చేద్దాం.. మీరూ వచ్చేయండి’ అంటూ కొడుకులు ఎన్నిసార్లు బతిమాలినా చిన్నప్పటి నుంచీ వ్యవసాయంపై పెనవేసుకున్న బంధం వారిని ఊరు విడిచి వెళ్లనీయడం లేదు.
చందంపేట మండలం కాట్రావత్ తండాకు చెందిన కాట్రావత్ రాములు, జీజ దంపతులు వ్యవసాయంపై ఆసక్తి కొద్దీ ఎంతో కష్టపడుతున్నారు. రాములు వయస్సు 90 సంవత్సరాలు. జీజకు 86 ఏండ్లుంటాయి. కానీ, వారికున్న 6.20ఎకరాల్లో రెండు పంటలు సాగు చేస్తున్నారు. ‘వ్యవసాయం అంటే మాకెంతో ఇష్టం.. కష్టమైనా మాకు ఇష్టమే. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలోనే ఉంటాం. కూలీలు లేకుండానే మేమిద్దరం చెల్కలో ఏదో ఒక పని చేసుకుంటాం.. సర్కారు రైతు బంధు సాయం చేస్తున్నది.. ఆ డబ్బులతోనే బోరు వేసి పైపులు కూడా కొన్నాం.. 24గంటలు కరంటు ఉంటున్నది.. రెండు పంటలు దర్జాగా పండించుకుంటున్నాం.. వానకాలం 30 క్వింటాళ్ల పత్తి పండించినం. యాసంగిలో పల్లీ వేసినం. వచ్చిన డబ్బులు మా కొడుకులకు కూడా పంపిస్తాం..’అని కాట్రావత్ రాములు, జీజ దంపతులు తెలిపారు.