పాలకవీడు, డిసెంబర్ 15 : మండలంలోని మహంకాళిగూడెంలో మట్టి మాఫియా చెలరేగిపోతున్నది. రాత్రివేళ భారీ యంత్రాలతో కృష్ణా తీరాన్ని తోడేస్తున్నది. సహజ సిద్ధ్ద నల్లరేగడి మట్టి, అటవీ భూముల్లోని గుట్టలను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేసి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మారుమూల ప్రాంతం, చిట్టడవిని తలపించేలా ఉండడంతో ఇక్కడ జనసంచారం తక్కువ. సహజ సిద్ధంగా ఏర్పడిన మట్టి గుట్టలుగా భారీగా ఉండడంతో అక్రమార్కుల కన్ను పడింది. భారీ యంత్రాలతో మట్టిని తవ్వి పదుల సంఖ్యలో టిప్పర్లలో తరలిస్తున్నారు. ఎక్కడైనా మట్టిని తవ్వాలంటే సాధారణంగా రెవెన్యూ శాఖ అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వానికి పన్ను సైతం చెల్లించాల్సి ఉంటుంది. నది, అటవీ ప్రాంతంలో తవ్వకాలకు ప్రత్యేక నిబంధనలుంటాయి. కానీ ఇక్కడ అవేవీ లేకుండానే అక్రమార్కులు ఇష్టానుసారంగా ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. నదీతీర ప్రాంతంలో ఈ స్థ్ధాయిలో అక్రమంగా సహజ మట్టి తరలుతున్నా రెవెన్యూ, అటవీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.
అర్ధరాత్రి తవ్వకాలు
గ్రామంలో కృష్ణా నదితీరంతోపాటు సైదులు నామా అటవీ ప్రాంతంలో అక్రమార్కులు రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా మట్టిని తవ్వి మహంకాళీ గుడి ప్రాంతంలో నిల్వ చేస్తున్నారు. అక్కడ నుంచి ఉదయం టిప్పర్ల సాయంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జానపహాడ్ దర్గా నుంచి శూన్యపహాడ్ వంతెన, పాలకవీడు మీదుగా గుట్టుచప్పుడు కాకుండా దామరచర్ల, మిర్యాలగూడ సహా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మట్టి తవ్వకానికి భారీ యంత్రాలు వినియోగిస్తుండడంతో తవ్విన ప్రాంతంలో భారీ ఎత్తున గుంతలు ఏర్పడుతున్నాయి. దాంతో నదీతీర ప్రాంతం తీవ్రంగా కోతకు గురవుతున్నది. గుంతల కారణంగా స్థానికులు ప్రమాదాల బారినపడే అవకాశం ఉంది. ప్రకృతి సంపద తరలిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
మహంకాళీగూడెం గ్రామంలో కొందరు అక్రమంగా మట్టిని తవ్వి రవాణా చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. రెవెన్యూ అధికారులతో కలిసి మట్టి రవాణా జరిగే ప్రాంతాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. అధికారుల ఆదేశాలకు అనుగుణంగా అక్రమార్కులపై చర్యలు తీసుకొంటాం.