ముషీరాబాద్ : తెలంగాణ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని కోరుతూ ఈ 12వ తేదీన సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నిర్వహించతలపెట్టిన రైతు ధర్నాను విజయవంతం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ధర్నా చౌక్లో జరిగే సిటీ స్థాయి ధర్నాకు ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రైతన్నకు అండగా నిలవాలని కోరారు. మంగళవారం తన క్యాంపు కార్యలయంలో డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలతో ధర్నా ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్ నుంచి 300 మంది కార్యకర్తలు, టీఆర్ఎస్ అభిమానులు పాల్గొనాలని కోరారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు ధర్నా చౌక్కు తరలిరావాలని సూచించారు.
12న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ధర్నాలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ అలీ, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొనున్నట్లు తెలిపారు.