-మదర్ డెయిరీ సంస్థలో సంబురాలు
హయత్నగర్ : నార్మాక్ పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహక సొమ్ము రూ.20.20 కోట్లు విడుదల చేసినందుకు హయత్నగర్లోని మదర్ డెయిరీ సంస్థలో శుక్రవారం నార్మాక్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, సంస్థ ఉద్యోగులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా శుక్రవారం గంగుల కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2019, జనవరి నుండి 2022 వరకు పాడి రైతులకు రావాల్సిన ప్రోత్సాహక సొమ్ము రూ.34.05 కోట్లు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వెంటనే బకాయిలు విడుదల చేసి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పాడి రైతులను ఆదుకోవాలని కోరుతూ నల్లగొండ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ను విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ రూ.20.20 కోట్లు విడుదల చేశారని సంతోషం వ్యక్తం చేశారు. 2021, జూలై నుండి ఇప్పటి వరకు దాదాపు రూ.4.51 కోట్ల ప్రోత్సాహక సొమ్ము ప్రభుత్వం నుండి పాడి రైతులకు అందాల్సి ఉందన్నారు. ప్రభుత్వం పాడి పశువుల పంపిణీ పథకం కింద యూనిట్లోని 46,665 మంది పాడి రైతులలో 14,160 మంది పాడి రైతులకు ఒక్కోక్క పశువుకు రూ.80వేల చొప్పున రూ.113.28 కోట్లతో 14,160 మంది పాడి పశువులను పంపిణీ చేశామని తెలిపారు.
ఇందులో రైతులు రూ.49.56 కోట్లు చెల్లించగా మిగతాది రూ.63.72 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో అందించిందని వివరించారు. పాడి రైతుల ప్రోత్సాహక పథకము కింద ఇప్పటి వరకు అందిన రూ.39.26 కోట్లు, పాడి పశువుల పంపిణీ కింద అందిన రూ.63.72 కోట్లు మొత్తం రూ.102.98 కోట్లు ప్రభుత్వం నుండి మా పాడి రైతులకు అందించినందుకు సీఎం కేసీఆర్కు యూనియన్ పాడి రైతుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.