ఇక నుంచి అంగన్వాడీ సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. దాంతో అంగన్వాడీ కేంద్రానికి ఒక్కరోజు వెళ్లి వారం పాటు వెళ్లకపోయినా ఫర్వాలేదు అనే రోజులకు కాలం చెల్లినట్లే. ఇకపై స్మార్ట్ ఫోన్లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 901 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. ప్రతి కేంద్రంలోని టీచర్కు ఆండ్రాయిడ్ ఫోన్ అందజేశారు. కొత్త యాప్ నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం జిల్లాలో శిక్షణ కొనసాగుతున్నది.
పోషణ్ ట్రాక్ యాప్ ద్వారా నిత్యం సేవలను పర్యవేక్షించే విధంగా కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ను రూపకల్పన చేశారు. ఈ యాప్ ద్వారా లబ్ధిదారులకు అందించే సేవలను నిత్యం నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సేవలను ఏ రోజుకారోజు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అధికారులకు అందేలా ప్రతి కేంద్రాన్ని ఇప్పటికే జియో ట్యాగింగ్ చేశారు. దాంతో అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా అంగన్వాడీ కేంద్రం ఎక్కడ ఉంది? టీచర్ ఎక్కడి నుంచి సమాచారం పంపారు? ఎన్ని గంటలకు పంపారనేది ఇట్టే తెలిసిపోతుంది. ఇందుకు సంబంధించిన అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు ఇప్పటికే 4జీ మొబైల్స్ అందజేశారు. ప్రతి ఫోన్ కమిషనరేట్ నుంచే ప్రత్యేక కోడ్ నంబర్లతో సహా వచ్చాయి. ఏ ఫోన్ను ఎవరికి ఇవ్వాలో పూర్తి స్థాయి సమాచారంతో వీటిని పంపిణీ చేశారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. త్వరలోనే కొత్త యాప్కు సంబంధించి కార్యకలాపాలు మొదలుకానున్నాయి.
ఆరు రకాల సేవలు..
ప్రాథమిక పాఠశాలల్లోకి…
అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందించడంతోపాటు చిన్నారులను నర్సరీ నుంచి ప్రాథమిక విద్యకు సంసిద్ధం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లోని గదులను కేటాయించేందుకు రూపకల్పన చేస్తున్నది. జిల్లాలో భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 901 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నానయి. ఇందులో 844 ప్రధాన, 57 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అద్దెభవనాల్లో కొనసాగుతున్న 17 కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లోని గదుల్లోకి మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా జిల్లాలో సుమారు 30 వేల మందికి పైగా పిల్లలకు పోషకాహారం, ప్రాథమిక విద్య అందిస్తున్నారు.
పారదర్శకత పెరుగనున్నది
జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు సెల్ఫోన్లు అందజేశాం. కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ఆయా కేంద్రాల డాటా ఎంట్రీ కూడా జరుగుతున్నది. అంగన్వాడీ కేంద్రాల నుంచి అందిస్తున్న సేవల్లో పారదర్శకత పెరుగడంతోపాటు రానున్న రోజుల్లో పనిభారం కూడా తగ్గనున్నది.
-కృష్ణవేణి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి