రూ.42.10 లక్షలతో ఆధునీకరణ పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న వాకర్స్
జూబ్లీహిల్స్,డిసెంబర్4: యూసుఫ్గూడలోని కృష్ణకాంత్ పార్కు కొత్తందాలు సంతరించుకోనుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు పార్కులో సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. సందర్శకుల సౌకర్యార్థం పా ర్కులో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల ఇక్కడ సర్వే నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావునగర్ డివిజన్ లో వాకర్స్తో పాటు సందర్శకుల ఆదరణ పొందిన ఈ పార్కును ఆధునీకరించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక ఇటీవల జీహెచ్ఎంసీ అధికారుల బృందంతో కలిసి ఇక్కడ పర్యటించారు. కృష్ణకాంత్ పార్కు సుమారు 19 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. ఇందులో 2 చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్స్, మూడు నీటి కొలనులతో పాటు ఓపెన్ జిమ్, యోగా లాన్ ఉంది. విశాలమైన వాకింగ్ ట్రాక్స్ ఉన్న ఈ పార్కులో టోపియారీ గార్డెన్, ఫార్మల్ గార్డెన్, ఆక్యుప్రెజర్ పార్కుతో పాటు నర్సరీ ఉంది. సందర్శకులకు రెండు మెగా సిట్టింగ్ గజెబో లాన్స్తో పాటు క్యాంటీన్ సౌకర్యం ఉంది. కాగా పాత కుర్చీల స్థానంలో కొత్త కుర్చీలు, టాయిలెట్ల ఆధునీకరణ, దేదీప్యమైన విద్యుద్దీపాలతో పార్కులో రూ.42.10 లక్షలతో సుందరీకరణ పనులు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్లో ఆధునిక ఆట వస్తువులు ఏర్పాటుచేయనున్నారు. వాకర్స్కు సౌకర్యవంతంగా ఉండేందుకు పాత్వేస్ మరమ్మతులు, ఆహ్లాదపరిచేలా లాన్ల సుందరీకరణ చేపట్టనున్నారు. ఈ మేరకు యూసుఫ్గూడ సర్కిల్ ఈఈ రాజ్కుమార్, ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి, యూబీడీ ఫీల్డ్ అసిస్టెంట్ అలీతో కలిసి జోనల్ కమిషనర్ ప్రియాంక ఇటీవల ఇక్కడ పర్యటించారు.