అంబర్ పేట : అంబర్ పేట నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గురువారం కలిసి సమీక్ష జరిపారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మొదలు కానున్న పనులు, పురోగతిలో ఉన్న పనులు, ఇతరాత్ర కొత్త పనులపై చర్చించారు. ప్రధానంగా వాన నీటి నాలాల అభివృద్ధి, రిటైనింగ్ వాల్ ల నిర్మాణం, వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలలో చేపట్టవలసిన చర్యలను ఎమ్మెల్యే కమిషనర్ కు వివరించారు.
ఎన్ ఎన్ డీపీ కింద మొదలైన నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ ను ఆనుకొని ఉన్న స్సేన్ సాగర్ నాలాకు ప్రహారిగోడ, రత్నానగర్ రిటైనింగ్ వాల్ , ఓల్డ్ రామాలయం వద్ద వరద ముంపునకు గురికాకుండా ఉండేందుకు నాలా అభివృద్ధి, మొయిన్ చెరువు నాలా పనుల విషయమై మాట్లాడారు. నియోజకవర్గంలోని బర్కత్ పుర, అలీకేఫ్ , నారాయణగూడ వైఎంసీఏ జంక్షన్ల అభివృద్ధి పై చర్చించి పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. అన్ని పార్కులను అభివృద్ధి పరిచే ప్రణాళికను త్వరగా అమలు చేయాలన్నారు. ఫీవర్ దవాఖాన, శివం రోడ్డులో ఏసీ బస్ షెల్టర్ల నిర్మాణాలపై కమిషనర్ ను అడిగారు.
విఘ్నన్ పురి కాలనీలో మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ముస్లీం గ్రేవ్ యార్డుకు కు జలమండలి కేటాయించిన మూడెకరాల స్థలంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కమిషనర్ దృష్టికి తెచ్చారు. అరాస్పెంట, మొయిన్ చెరువు హిందూ స్మశాన వాటికల్లో కన్సల్టెన్సీని నియమించి చేపట్టవలసిన అభివృద్ధి పనులను మొదలు పెట్టాలని విన్నవించారు. డీ మార్ట్ దగ్గర చేపట్టిన నాలా విస్తరణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
దీనికి స్పందించిన కమిషనర్ అన్ని పనులను త్వరలోనే మొదలు పెడతామని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సమావేశంలో జీహెచ్ ఎంసీ ఈఎన్ సీ జియావుద్దీన్ , హార్టికల్చర్ అడిషనల్ కమిషనర్ కృష్ణ, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ అనిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.