మాదాపూర్ : ఈ నెల 25న మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభను దృష్టిలో ఉంచుకొని ఆహ్వన కమిటీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఏర్పాట్ల పనులను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సభ జరగనున్న హైటెక్స్ ప్రాంగణాన్ని పరిశీలించారు.
సబితా ఇంద్రారెడ్డితో పాటు చెవెళ్ళ ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు నవీన్రావు, శంబీపూర్ రాజు, టీఎస్ఐఐసి చైర్మెన్ బాలమల్లు, సివిల్ సప్లై చైర్మెన్ మారెడ్డి శ్రీని వాసరెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్ లతో పాటు ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.
ఇందులో భాగంగా మాదాపూర్లోని హైటెక్స్ ప్రాంగణంలో జరిగే సభ ప్రాంగణం వద్ద వేదిక, సభకు హజరుకానున్న వారి కొరకు పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్తో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేస్తున్నారు. నిర్ణీత సమయంలోపే సభకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత ఇంచార్జీలకు పలు సూచనలు చేశారు. భద్రత, ట్రాఫిక్కు చెందిన అంశాలపై పోలీసులు అప్రమత్తంగా ఉంటు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు.