కొండాపూర్ : కొవిడ్ బారీనపడి చికిత్స పొందుతున్న సమయంలో మ్యూకార్ముకోసిస్ (బ్లాక్ ఫంగస్) సోకడంతో పాడైపోయిన దవడను హైటెక్సిటీలోని మెడికవర్ దవాఖాన వైద్యులు పునర్మించారు.
బ్లాక్ ఫంగస్తో పై దవడలు (చెంప ఎముకలు, అంగిలి, కంటి ఆధారం, మృదు కణజాలాలు) పాడైన ఇద్దరు రోగులు దవఖానలోని డెంటల్ విభాగం వైద్యులను సంప్రదించగా, వారికి మెరుగైన శస్త్ర చికిత్సల ద్వారా యధావిధిగా దవడలను అమర్చినట్టు బుధవారం దవాఖాన వైద్యులు డాక్టర్ శరత్ బాబు వెల్లడించారు.
విజయవాడకు చెందిన సత్యం (40), రాము(40)లు కొవిడ్ భారీన పడి కోలుకున్నారు. కొద్ది రోజులకే ఇద్దరికి మ్యూకార్ముకోసిస్ (బ్లాక్ ఫంగస్) వ్యాధి బారినపడ్డారు. దీంతో ఇద్దరికి ఎగువ దవడ, దంతాలను తీసివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దవడ తొలగించకపోతే ప్రాణానికి ప్రమాదమున్నదన్న విషయాన్ని వారికి తెలియజేయడంతో తొలగింపుకు అంగీకరించారు.
దవడలు తొలగించిన మూడు నెలల తర్వాత మూడు దశల్లో 3డీ సీటీ ఫేషియల్ ఎముకల పునర్మిర్మాణం, 3డీ మిల్లింగ్ టైటానియం ఇంప్లాంట్ ప్లేట్లను రూపొందించి కోల్పోయిన దవడతో పాటు దంతాలను అమర్చడం జరిగింది. దవడల అమరిక పూర్తైన అతి తక్కువ సమయంలోనే రోగులు తమ ఆహారాన్ని నోటి ద్వారా తీసుకోవడంతో పాటు ముందులా మాట్లాడగల్గుతున్నట్లు వైద్యులు శరత్ బాబు తెలిపారు.