పెరిగిన పెట్టుబడులు, ఉపాధి కల్పన
వరి సాగులోనూ జిల్లా ముందంజ
పెరిగిన ఎరువుల వినియోగం
రేషన్ బియ్యం పంపిణీలో మెదక్ జిల్లా టాప్
పౌష్టికాహారం అందజేయడంలో రాష్ట్రంలో మూడోస్థానంలో సిద్దిపేట
అన్నిరంగాల్లో అద్భుత పురోగతి
ఆర్థిక సర్వేలో వెల్లడి
సంగారెడ్డి మార్చి 21(నమస్తే తెలంగాణ):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా పారిశ్రామిక రంగంలో పరుగులు తీస్తున్నది. వ్యవసాయం, విద్య, వైద్యరంగాల్లోనూ గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నది. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, ఉపాధి కల్పన విషయంలో రాష్ట్రంలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుండటంతో సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో వరితో పాటు ఇతర పంటల సాగు గతంలో కంటే బాగా పెరిగింది. ఎరువుల వినియోగం పెరుగుతున్నది. మెదక్ రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. రేషన్ బియ్యం పంపిణీ, ఫార్మా ఉత్పత్తులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులో ఉమ్మడి మెదక్ జిల్లా ముందంజలో ఉంది. పౌష్టికాహారం అందజేసే విషయంలో రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా తృతీయ స్థానంలో ఉంది. ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సర్వే ఈ విషయాలను వెల్లడించింది. అన్నిరంగాల్లో అద్భుతమైన ప్రగతి కనిపిస్తున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లా పారిశ్రామిక, విద్య, వైద్యరంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నది. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, ఉపాధి కల్పన విషయంలో రాష్ట్రంలో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుండటంతో సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో వరితో పాటు ఇతర పంటల సాగు పెరిగింది. జిల్లాలో ఎరువుల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ ప్రాంత రైతులు ఎరువులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. పారిశ్రామిక ఉత్పత్తులు, విద్య, వైద్యరంగాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానం వైపు పయనిస్తున్నది. రేషన్ బియ్యం పంపిణీలో రాష్ట్రంలోనే మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో భాగంగా విడుదల చేసిన తెలంగాణ సోషియో ఎకనమిక్ ఔట్లుక్ 2021లో ఆయా విషయాలు వెల్లడయ్యాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పంటల సాగు ఏటా పెరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా సిద్దిపేట, మెదక్ జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగింది. 2019-20లో మెదక్ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 58.60 శాతం ఉండగా, సిద్దిపేట జిల్లాలో 39.70 శాతం, సంగారెడ్డి జిల్లాలో 10.40 శాతం ఉంది. పంట మార్పిడి వైపు క్రమంగా రైతులు ఆసక్తి చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 0.77 శాతం మంది రైతులు పంటమార్చిడి పాటించగా, సిద్దిపేటలో 0.71 శాతం, మెదక్లో 0.61 శాతం మంది రైతులు పంట మార్చిడి వైపు మళ్లారు. ఇక ఎరువుల వినియోగం జిల్లాలో పెరుగుతున్నది. జాతీయ వ్యవసాయ నివేదికను అనుసరించి వానకాలం, యాసంగి సీజన్లో రైతులు ఎరువుల వాడకం పెరుగుతున్నది. మెదక్ జిల్లాలో అత్యధికంగా ఎకరాకు 358 కిలోల ఎరువులను రైతులు వినియోగిస్తుండగా, సిద్దిపేట జిల్లాలో తక్కువగా ఎకరాకు 88 కిలోల ఎరువులు వినియోగిస్తుండగా, సంగారెడ్డి జిల్లా రైతులు ఎకరాకు కేవలం 80 కిలోల చొప్పున ఎరువులు వాడుతున్నారు. జిల్లాలో పంట కాల్వలు, చెరువుల కింద సాగవుతున్న పంటపొలాల విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నట్లు తెలంగాణ ఆర్థిక సర్వే గణాంకాలు చెబుతున్నాయి.
పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల్లో అగ్రస్థానం…
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలకు టీఎస్ ఐపాస్ ద్వారా సులభంగా అనుమతులు జారీచేస్తున్నది. టీఎస్ఐపాస్ కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు, ఉపాధికల్పన గణనీయంగా పెరిగింది. తెలంగాణ సోషియో ఎకనమిక్ ఔట్లుక్ 2015 నుంచి 2020 వరకు పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉపాధి కల్పన గణాంకాలను వెల్లడించింది. పరిశ్రమల స్థాపన విషయంలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉంది. పరిశ్రమల స్థాపనలో మేడ్చల్ మొదటి స్థానంలో ఉంది. మేడ్చల్లో 2015 నుంచి 2021 వరకు మొత్తం 3327 పరిశ్రమలు ఏర్పడ్డాయి. సంగారెడ్డి జిల్లాలో 2015 నుంచి 2021 వరకు 1149 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మెదక్ జిల్లా పరిశ్రమల స్థాపన విషయంలో రాష్ట్రంలో 11వ స్థానంలో ఉంది. మెదక్ జిల్లాలో 2015 నుంచి 2021 వరకు 365 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 2015 నుంచి 2021 వరకు 276 పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి. 20215 నుంచి 2021 వరకు పెట్టుబడుల విషయంలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉంది. 2015 నుంచి 2021 వరకు సంగారెడ్డి జిల్లాలో రూ.12,544 కోట్టు పెట్టుబడులు వచ్చాయి. మెదక్ జిల్లాకు రూ.3750 కోట్ల పెట్టుబడులు రాగా, సిద్దిపేట జిల్లాకు 2,228 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఉపాధి కల్పనలో రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలో 2015 నుంచి 2021 వరకు 8,81,050 మందికి ఉపాధి లభించింది. ఉపాధి కల్పనలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. 2015 నుంచి 2021 వరకు సంగారెడ్డి జిల్లాలో 95,767 మం దికి ఉపాధి లభించింది. మెదక్ జిల్లాలో 15.937 మం దికి, సిద్దిపేట జిల్లాలో 10,709 మందికి ఉపాధి లభించింది.
ఉత్పత్తి రంగంలో సంగారెడ్డి, మెదక్ ముందంజ
పరిశ్రమల ద్వారా వివిధ రకాల ఉత్పత్తుల తయారీలో ఉమ్మడి మెదక్ జిల్లా ముందంజలో ఉంది. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ను అనుసరించి ఫార్మా ఉత్పత్తుల్లో మెదక్ రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. ఉత్పత్తి రంగానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా 34 శాతం ఉత్పత్తులతో అగ్రస్థానంలో ఉండగా, నల్లగొండ 18 శాతం, మహబూబ్నగర్ 16 శాతం, మెదక్ 11 శాతం ఫార్మా, కెమికల్ ఉత్పత్తి చేస్తున్నాయి. టెక్స్టైల్ ఉత్పత్తులకు సంబంధించి రంగారెడ్డి 30 శాతం, మెదక్ 18 శాతం, మేడ్చల్ 18 శాతం, మహబూబ్నగర్ 8 శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. నాన్ మెటాలిక్ మినరల్స్ ఉత్పత్తిలో నల్లగొండ 37 శాతం, రంగారెడ్డి 17 శాతం, ఆదిలాబా 8 శాతం, సంగారెడ్డి 5 శాతం మేర ఉత్పత్తి చేస్తున్నాయి. యంత్రాలు, పరికరాల ఉత్పత్తిలో రంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమలు 41 శాతం ఉత్పత్తులు చేపడుతుండగా, మేడ్చల్ 35 శాతం, సంగారెడ్డి 14 శాతం, హైదరాబాద్ ఆరుశాతం ఉత్పత్తులు చేస్తున్నాయి. ఆహార ఉత్పత్తుల్లో రంగారెడ్డి జిల్లా పరిశ్రమలు 34 శాతం ఉత్పత్తి చేస్తుండగా మహబూబ్నగర్ 19 శాతం, మేడ్చల్ 10 శాతం, మెదక్లోని పరిశ్రమలు ఆరుశాతం ఉత్పత్తులు చేస్తున్నాయి.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులో ఉమ్మడి మెదక్ జిల్లా ముందంజలో ఉంది. రాష్ట్రస్థాయిలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనలో సంగారెడ్డి జిల్లా నాలుగో స్థానంలో ఉంది. 2014 నుంచి 2020 మార్చి వరకు సంగారెడ్డి జిల్లాలో 5.9 శాతం పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఇక మెదక్ జిల్లాలో 2.0 శాతం, సిద్దిపేటలో 1.8 శాతం పరిశ్రమలు స్థాపించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించి మేడ్చల్ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండగా, సంగారెడ్డి జిల్లా తృతీయ స్థానంలో ఉంది. సంగారెడ్డి జిల్లాలో 11.6 శాతం పెట్టుబడులు రాగా, మెదక్లో 3.9 శాతం, సిద్దిపేట జిల్లాలో 2.8 శాతం పెట్టుబడులు వచ్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పనలో రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. మేడ్చల్ జిల్లాలో అత్యధికంగా 27.8 శాతం ఉపాధి కల్పించగా, సంగారెడ్డి జిల్లా 13.9 శాతం ఉపాధి కల్పించింది. మెదక్ జిల్లాలో 4.0 శాతం, సిద్దిపేట 2.1 శాతం ఉపాధి కల్పించటం జరిగింది.
విద్య, వైద్యరంగంలోనూ ఉమ్మడి మెదక్ జిల్లా భేష్…
ఆరోగ్యకరమైన గణాంకాలు…
ప్రజారోగ్యానికి సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కేసీఆర్ కిట్ ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2015-16లో 91.0 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరుగగా, 2019-20 నాటికి ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 96.4 శాతానికి చేరుకుంది. టీకాల పంపిణీ శాతం పెరిగింది. 2015-16లో 71.7 శాతం టీకాలు వేయగా, 2019-20లో టీకా పంపిణీ శాతం 81.4 శాతానికి పెరిగింది. పిల్లలకు పౌష్టికాహారం అందజేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అంగన్వాడీల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. 6 నుంచి 23 నెలలల పిల్లలకు పౌష్టికాహారం అందజేసే విషయంలో రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా తృతీయ స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న నిజామాబాద్లో 18.4 శాతం పౌష్టికాహారం అందుతుండగా, సిద్దిపేటలో 14.1 శాతం పౌష్టికాహారం అందుతున్నది. మెదక్ జిల్లాలో 12.3 శాతం, సంగారెడ్డి జిల్లాలో 6.4 శాతం పౌష్టికాహారం అందుతున్నది.