ఏడేండ్లలో రూ.30 కోట్లతో అభివృద్ధి పనులు
వచ్చే కల్యాణం నాటికి మల్లన్నకు బంగారు కిరీటం
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవుడిని మొక్కుకున్నా..
ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు
సిద్దిపేట ప్రతినిధి, డిసెంబర్ 26, (నమస్తే తెలంగాణ)/ చేర్యాల;కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఆదివారం ఆలయ తోటబావి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై వైభవంగా జరిగింది. కల్యాణోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం వివాహం జరిపించారు.
మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, చామకూర మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వెలేటి రోజాశర్మ, ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఆలూరి బాలాజీతో కలిసి ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సమర్పించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మల్లన్నస్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు పడిగన్నగారి మల్లికార్జున్ దంపతులు, అమ్మవార్ల తరఫున మహాదేవుని మల్లికార్జున్ దంపతులు పాల్గొని కల్యాణం చేయించారు. గర్భగుడిలో జరిగిన కల్యాణోత్సవంలో అమ్మవారి తరఫున మహాదేవుని మనోహర్ దంపతులు, మల్లన్న స్వామి తరఫున పడిగన్నగారి మల్లయ్య దంపతులు పాల్గొన్నారు.
కనుల పండువగా ఊరేగింపు…
కల్యాణానికి ముందు మల్లన్న స్వామి, బలిజ మేడలదేవి, గొల్ల కేతాదేవి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అర్చకులు ఆలయం నుంచి పోలీసుబొమ్మ, రాతిగీరలు, ఆలయ పరిసరాల్లో ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, కోలాటం, భజనలు, వేద పాఠశాల విద్యార్థుల శివకీర్తనలతో కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన బార్సి మహాపీఠశాఖ వీరశైవ గురువు గురుసిద్ధ మణికంఠ శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో కల్యాణం జరిగింది. వీరశైవ ఆగమ పండితులు, పురోహితులు, ఆగమ పాఠశాల వేదపండితులు, విద్యార్థులు స్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. స్వామి కల్యాణోత్సవానికి డాక్టర్ మహంతయ్య, నందుల మఠం శశిభూషణ సిద్ధాంతి స్వామీజీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. భక్తుల సౌకర్యార్థం శామియానాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 5గంటలకు ఆలయవర్గాలు రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అన్నం వండి రాశిగా తయారు చేసి దృష్టికుంభం కార్యక్రమాన్ని నిర్వహించారు.
కల్యాణ తంతు సాగిందిలా…
స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం మార్గశిర మాసం సప్తమి ఉదయం 10.45 గంటలకు కొమురవెల్లి పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదికలో మల్లన్న స్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఊరేగింపుగా వెళ్లి స్వామి తరఫున మహాదేవుని వంశస్తులు, పడిగన్నగారి వంశస్తులు కూర్చొని కల్యాణోత్సవం నిర్వహించారు. స్వామి కల్యాణానికి తాళి, మట్టెలు, ఒడిబియ్యం, బట్టలు తీసుకువచ్చి వైభవంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12గంటలకు రుద్రాభిషేకం, సాయంత్రం శకటోత్సవం నిర్వహించారు. ఉత్సవాలకు హాజరైన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్ల చైర్మన్లకు ఆలయ ఈవో ఆలూరి బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లకు మంత్రి హరీశ్రావు పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు కొమురవెల్లి గ్రామ సంప్రదాయం మేరకు సర్పంచ్ సార్ల లతకిష్టయ్య దంపతులు, ఒగ్గు పూజారులు పట్టువస్ర్తాలు, పుస్తె మట్టెలు సమర్పించారు. కార్యక్రమాల్లో సిద్దిపేట ఆర్డీవో అనంత్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మల్లన్న ఆలయ ధర్మకర్తలు ఉట్కూరి అమర్గౌడ్, బొంగు నాగిరెడ్డి, దినేశ్ తివారీ, ముత్యం నర్సింహులు, గడ్డం మహేశ్యాదవ్, పోతుగంటి కొమురవెల్లి, కొంగరి గిరిధర్, చింతల పరశురాములు, తూముల రమేశ్యాదవ్, సాయియాదవ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
నేడు మల్లికార్జున స్వామికి లక్ష బిల్వార్చన
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం ఆలయవర్గాలు భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన పూజలు నిర్వహించనున్నారు. కల్యాణం మరుసటి రోజు ఆలయ సంప్రదాయం ప్రకారం లక్ష బిల్వార్చన పూజలు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీ. అనువంశిక వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం స్వామి ఆలయంలో గణపతి పూజ, రుద్రాభిషేకం, బిల్వార్చన, హారతి, మంత్రపుష్పం, మహా నైవేద్యం తదితర పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించనున్నారు. లక్ష బిల్వాలను (మారేడు) స్వామి మూలవిరాట్ వద్ద సమర్పిస్తూ.. 1008 పర్యాయాలు మల్లన్న నామస్మరణలను పటిస్తూ అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించనున్నారు. భక్తులు హాజరుకావాలని ఆలయ ఈవో బాలాజీ, చైర్మన్ భిక్షపతి కోరారు.
సీఎం కేసీఆర్తో మల్లన్న ఆలయ అభివృద్ధి : ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు
రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతోనే కొమురవెల్లి మల్లన్న ఆలయానికి మహర్దశ పట్టిందని, సీఎం కృషితో ఆలయం అభివృద్ధి చెందుతున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. కల్యాణోత్సవం అనంతరం మల్లన్నను మంత్రులు తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు దర్శించుకున్నారు. ఆ ఆర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ కొమురవెల్లి మల్లన్న పేరు మీద రాష్ట్రంలోనే అతిపెద్దదైన మల్లన్నసాగర్ నిర్మించారన్నారు. కొమురవెల్లి మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని, అన్ని ప్రాజెక్టులు పూర్తవుతున్నట్లు తెలిపారు. లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చుకున్నామంటే అంతా ఆ మల్లన్న దయతోనే అన్నారు. ఏడేండ్లల్లో మల్లన్న ఆలయం ఎంతో అభివృద్ధి జరిగిందని, రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతున్నదని, భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మూడు వెండి ధర్వాజాలు పూర్తి చేసుకున్నామని తెలిపారు. మల్లన్న దేవుడికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంగారు కిరీటం చేయిస్తామని సంకల్పించారని, వచ్చే కల్యాణం నాటికి మల్లన్నకు బంగారం కిరీటం పెడతామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కరోనా మహమ్మారి పీడ విరగడి కావాలని మల్లన్నను మొక్కుకున్నట్లు మంత్రి హరీశ్రావు చెప్పారు.