రంగారెడ్డి జిల్లాకోర్టులు : అభం శుభం తెలియని బాలుడిని చంపిన నిందితుడు రతుల్ సతియాకు యావజ్జీవ కారాగారా శిక్ష, రెండువేల జరిమానా విధిస్తూ రంగారెడ్డిజిల్లా రెండవ అదనపు జిల్లాన్యాయమూర్తి మంజరి తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.రాము కథనం ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన నిందితుడు రతుల్ సతియా మోయినా బాద్ మండలం అజీజ్నగర్లో నివసిస్తూ అదే ప్రాంతంలోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు.
అదే స్కూల్లో సెక్యూరిటీగా విధులు నిర్వర్తించే మనిత్ బ్రిజియాతో పరిచయం ఏర్పడింది. దీంతో నిందితుడు రతుల్ నిత్యం మనిత్ వాళ్ళ ఇంటికి వెలుతుండేవాడు ఈ క్రమంలో మనిత్ బందువుపై కన్నేసిన నిందితుడు ఆమే వెంటపడు తూ, పెళ్ళి చేసుకోవాలని వేధించేవాడు. అమ్మాయి తల్లిదండ్రులను తమ పెళ్ళి చేయాలని కోరగా వారు నిరాకరించారు.
దీంతో వారి కుటుంబంపై కక్ష పెంచుకున్న నిందితుడు రతల్ సతియా మనిత్ బ్రిజియా కుమారుడు ఆదిత్య బ్రిజియాతో ఆడుకుందామని తీసుకుపోయి బండరాయితో కొట్టి హత్య చేశాడు. బాలుడు కనిపించడంలేదని బాలుడి తల్లి సిందుదేవి మోయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రతుల్ సతియానే నిందుతుడిగా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరిలించి నిందితుడిపై అభియోగపత్రాలను దాఖలు చేశారు, సాక్షాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు రతుల్ సతియాకు యావజ్జీవ కారాగారా శిక్ష, రెండువేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా రెండవ అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది.