బాలకార్మికుల మోములో చిరునవ్వులు విరబూయనున్నాయి. వెట్టి చాకిరీ, బడిబయట పనుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి బాలకార్మిక వ్యవస్థను నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆపరేషన్ స్మైల్ను ప్రారంభించారు. ఈనెలాఖరు వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిన్నారులను గుర్తించి వారికి విద్యాబుద్ధులు నేర్పించేందుకు పాఠశాలల్లో చేర్పించనున్నారు. చిన్నారులను ఎవరైనా పనుల్లో పెట్టుకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏమీ తెలియని పసి వయస్సులో..పలక,బలపం,పుస్తకం చేత పట్టుకుని బడికి వెళ్లాల్సిన బాల్యం వయస్సుకు మించిన బరువులు మోస్తూ నరకాన్ని చూస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులతో పిల్లలను చదివించడం, పోషించడం కష్టంగా మారిందనే సాకును చూపిస్తూ ఎంతో మంది తల్లిదండ్రులు పలక పట్టాల్సిన చేతులతో బరువులను మోపిస్తున్నారు. ఇటుక బట్టీలు, నిర్మాణ రంగాలు, హోటళ్లలో సర్వర్లుగా కూలీ బతుకులను ఈడిస్తూ పసిప్రాయంలోనే బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు.
బాల కార్మిక వ్యవస్థను నియంత్రించేందుకు బడి బయట పిల్లలను, వెట్టి చాకిరిలో మగ్గుతున్న బాలబాలికలను గుర్తించి తిరిగి పాఠశాలలకు పంపించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమమే ఆపరేషన్ స్మైల్. ఇందులో భాగంగా ఈనెలాఖరుకు వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బడి బయటి పిల్లలను బడిలో చేర్పించనున్నారు.
పలు శాఖల సమన్వయం
బాల కార్మిక వ్యవస్థను నియంత్రించడానికి, బాలలను పనుల్లో పెట్టుకోకుండా పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ పని చేస్తుంది. కమిటీలో పోలీస్ శాఖ, కార్మిక, మాతా శిశు సంక్షేమ శాఖ, విద్య, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, క్రీడా శాఖలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు విధులను నిర్వహిస్తాయి.
ముఖ్య ఉద్దేశం
బాల కార్మిక వ్యవస్థ లేకుండా చేసేందుకు 2015 నుంచి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. బాల కార్మికులను, భిక్షాటన, వెట్టి చాకిరి చేస్తున్న వారిని గుర్తించి వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం, అనాథలను ఆశ్రమాలకు పంపడం, మెరుగైన విద్య అందించేందుకు చర్యలు తీసుకునేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 1నుంచి 30వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
వనపర్తి జిల్లాలో ఇలా..
2020సంవత్సరంలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 58మంది, ఆపరేషన్ స్మైల్ ద్వారా 79మంది మొత్తం 137 మంది బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు కమిటీ సభ్యులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మొత్తంగా 171 మంది పిల్లలను బాల సదన్కు పంపించినట్లు సంవత్సర వార్షిక నివేదికలో ఎస్పీ అపూర్వరావు తెలిపారు. డిసెంబర్29న కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సమావేశాన్ని నిర్వహించారు. అన్ని స్థాయిల అధికారులు బాలల రక్షణకు కృషిచేయాలని, పనిచేసే బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని, గుర్తించిన బాలబాలికలను పాఠశాలల్లో చేర్చేందుకు అన్ని చర్యలను తీసుకోవాలని పలు అంశాలను సంబంధిత కమిటీ సభ్యులకు వివరించారు.
పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు
పిల్లలను పనిలో పెట్టుకుంటే యజమానిపై చర్యలు తీసుకుంటాం. షాపింగ్ కాంప్లెక్స్లు, దుకాణాలు, ఇతర ప్రాంతాలపై కమిటీ సభ్యుల నిఘా ఉంటుంది. బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి విద్యను అందిస్తారు. కేవలం కార్యాలయ పనివేళ్లలో తనిఖీలు ఉంటాయని మిగతా సమయంలో ఉండవని అపోహతో ఎవరైనా బాలలతో పని చేయించుకుంటే వారిపై కఠిన చర్యలను తీసుకుంటాం.