నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కిందయాసంగిలో వివిధ పంటల సాగు కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు మంగళవారం నీటి విడుదల చేశారు. ఏప్రిల్ 7 వరకు ఏడు దఫాలుగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో 63.970 టీఎంసీల నీటిని ఇవ్వనున్నారు. ఆ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు.
హాలియా, డిసెంబర్ 15 : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో యాసంగి సాగుకు బుధవారం ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. బుధవారం (ఈ నెల 15) నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వరకు ఏడు దఫాలుగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో 63.970 టీఎంసీలు విడుదల చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. అదేవిధంగా లిఫ్ట్లు, తాగునీటి అవసరాలు, చెరువులు నింపేందుకు మరో 34.903 టీఎంసీలు విడుదల చేయనున్నారు. తొలి విడుతగా జనవరి 7 వరకు నీటి విడుదల కొనసాగనుంది. ఈ విడుతలో 24 రోజుల పాటు 2842 క్యూసెక్కుల నీరు విడుదల చేయనున్నారు. రెండో విడుతలో జనవరి 14 నుంచి 22 వరకు 2,842 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. మూడో విడుతగా జనవరి 29 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 6 వరకు కొనసాగనుంది. ఈ దఫాలో 2842 క్యూసెక్కుల నీరు విడుదల కానుంది. నాలుగో విడుతగా ఫిబ్రవరి 13 నుంచి 21 వరకు 2842 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. ఐదో విడుతగా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 8 వరకు 2,842 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ఆరో విడుతగా మార్చి 15 నుంచి 23 వరకు 2842 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు.
చివరగా ఏడో విడుతగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 7 వరకు 2842 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
నీటి విడుదలను రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఈ ధర్మానాయక్ కోరారు. కాలువ చివరి భూముల రైతులు వరి కంటే ఆరుతడి పంటలు వేసుకోవడం మంచిదని సూచించారు.