వరి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రైతులు వరికి బదులు ఇతర పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. యాసంగిలో ఆరుతడి పంటలు మేలన్న వ్యవసాయ అధికారుల సలహాల మేరకు కూరగాయల సాగు చేపడుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న అధికారులు అందుకు అవసరమైన విత్తనాలను సైతం అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలం మహబూబ్పేట గ్రామానికి చెందిన గాజుల నర్సయ్య ఇతర పంటలు సాగును ప్రారంభించాడు.
ఎకరం పొలంలో…
నర్సయ్య తనకున్న మూడు ఎకరాల్లో గతంలో వరి సాగు చేశాడు. ఓ వైపు మార్కెటింగ్ సమస్య, ఇంకోవైపు వరి వేయొద్దన్న ప్రభుత్వ సూచనలకు తోడు యాసంగిలో కూరగాయల సాగు చేపట్టాడు. ఎకరం పొలంలో అర ఎకరం బీర, అర ఎకరం టమాటీ వేశాడు. నెలన్నర కిందట కూరగాయల విత్తనాలు వేశాడు. తన కొడుకు శ్రీకాంత్తో కలిసి సాగు పనులు స్వయంగా చేసుకుంటున్నాడు. ఏదైనా అవసరమున్న సమయంలో వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. మరో 20 రోజుల్లో టమాటా, బీర పంటల దిగుబడి చేతికి వస్తుందని చెప్తున్నాడు. పంట వేసిన నాటి నుంచి రోజూ అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు నర్సయ్య చెబుతున్నాడు. కూరగాయల సాగు మరింత లాభదాయకంగా ఉంటే మిగతా భూమిలో కూడా ఇతర పంటలు సాగు చేస్తానని చెప్తున్నాడు.
ఈ సారి వరి వేయలేదు..
ఇతర పంటలను సాగు చేస్తే మంచిదని అధికారులు చెప్పడంతో వరి కాకుండా కూరగాయలు సాగు చేస్తున్నాను. వరి వద్దనుకొని ప్రస్తుతానికి బీర, టమాటా వేశాను. దిగుబడి, ఆదాయం చూసిన తర్వాత మరింత విస్తీర్ణంలో సాగు చేస్తాను.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
ఇతర పంటల సాగు విషయంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆరుతడి పంటలు, కూరగాయలు, మినుములు, సజ్జలు వంటి ఇతరత్రా పంటలు సాగు చేయాలని చెప్తున్నాం. రైతులు కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందిస్తున్నాం.