జూబ్లీహిల్స్ : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే తెలంగాణ ప్రభుత్వం ఆత్మరక్షణ క్రీడలకు తగిన ప్రాచుర్యం కల్పిస్తుందని, ప్రాచీన క్రీడలలో ఒకటైన కరాటేను పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. ఆదివారం యూసుఫ్గూడ కోట్లవిజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో సినీహీరో విశ్వక్ సేన్, నిర్మాత సి.కళ్యాణ్లతో కలిసి తెలంగాణ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్-2021 క్రీడలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మాట్లాడుతూ ఇటీవల ఒలింపిక్స్లో కరాటే క్రీడను ప్రవేశపెట్టడం శుభ పరిణామమని, కరాటే క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ భవిష్యత్ విశ్వక్రీడలలో భారత పతాకాన్ని రెపరెపలాడించాలని కోరారు. ప్రతిభ చూపించే క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, యువత కరాటే లో తెలంగాణ కీర్తిని ఇనుమడింపచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా పోటీలలో పాల్గొంటున్న యువ క్రీడాకారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్గూడ డివిజన్ కార్పొరేటర్ బండారి రాజ్కుమార్ పటేల్తో పాటు పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.