యాదాద్రి భువనగిరి, డిసెంబరు 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. పీఎం
ఎఫ్ఎంఈ కింద మహిళా సంఘాల యూనిట్లు
నల్లగొండ 432
సూర్యాపేట 217
యాదాద్రి 516
సభ్యులకు రుణాలు అందించి ఆర్థిక చేయూతను కల్పిస్తున్నది. లక్ష్యానికి మించి యూనిట్లను నెలకొల్పడంలో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే ముందున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 516 యూనిట్లను ఏర్పాటుచేసి, రూ.2కోట్లకుపైగా రుణాలను అందజేసింది. త్వరలోనే మరో వంద యూనిట్లు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నది. కల్తీలేని ఆహారాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు, తక్కువ ధరలకే వినియోగదారుడికి ఆహార ఉత్పత్తులను అందించే దిశగా చేస్తున్న ఈ ప్రయత్నంతో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఉపాధి అవకాశాలతోపాటు ఆయా కుటుంబాల ఆర్థిక వృద్ధి సైతం మెరుగుపడుతున్నదని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లో మహిళలకు రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నిధులతో ఇది వరకే యూనిట్లను ఏర్పాటు చేయించింది. మహిళలు సమర్థవంతంగా నిర్వహిం చుకుంటున్న ఆయా ఆహార ఉత్పత్తుల శుద్ధ్ది యూనిట్లను మరింతగా విస్తరించే దిశగా ప్రధానమంత్రి ఫార్మాలైజేషన్ మైక్రో ఎంటర్ ప్రైజెస్(పీఎంఎఫ్ఎంఈ) పథకంతో చేయూత కల్పిస్తున్నది.
జిల్లా ఫస్ట్
పీఎంఎఫ్ఎంఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది మహిళా సంఘం సభ్యులను గుర్తించి రూ. 24.84 కోట్ల వరకు రుణాలను అందించారు. నల్లగొండ జిల్లాలో 432 మందికి రూ.1.72 కోట్లు, సూర్యాపేట జిల్లాలో 217 మందికి రూ.8.76 లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 516 మందికి రూ.2.01 కోట్లను రుణంగా అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తించిన యూనిట్లే అధికం. జిల్లాలో రొట్టెలు, బిస్కెట్లు, కేకులు, కోవా, పన్నీరు, ప్యాక్ చేసిన నెయ్యి, ప్యాకింగ్ తేనె, సుగంధ ద్రవ్యాలు, పాలతో చేసిన పానీయాలు, తృణ ధాన్యాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలతో చేసిన ఉత్పత్తులు, పచ్చళ్లు, సాస్లు, పండ్ల రసాలు, నూనెల ఉత్పత్తులు, మిఠాయిలు, స్నాక్స్, అప్పడాలు, చిప్స్ తయారీకి సంబంధించిన యూనిట్లను గుర్తించి సంబంధిత మహిళలకు సెర్ఫ్ అధికారులు రుణాలు అందజేశారు.
ఐదేండ్ల ప్రణాళిక..
ఆహార శుద్ధి పరిశ్రమలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐదేండ్ల గరిష్ఠ ప్రణాళిక (2020-2025)ను రూపొందించి అమలు చేస్తున్నది. యూనిట్లు ఎంపికైన మహిళా సభ్యులకు తొలుత రూ.40 వేల గ్రాంటును అందిస్తారు. తీసుకున్న ఈ రుణాన్ని 6 శాతం వడ్డీతో తిరిగి 24-36 కిస్తీలతో గ్రామ సంఘం ద్వారా మండల సమాఖ్యలకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత యూనిట్ విస్తరణకు అవసరమైన డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను సమర్పిస్తే రూ.10 లక్షల వరకు రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇందులో 40 శాతం రాయితీతో ప్రభుత్వం సహకార రుణాలను మం జూరు చేస్తుండగా.. మిగిలిన 60 శాతం బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సి ఉంటుంది. రాయితీ పోను మిగతా రుణ సొమ్మును ఆయా మహిళా సభ్యులు 93 పైసల వడ్డీతో మండల సమాఖ్యకు చెల్లించాల్సి ఉంటుంది.
మన జిల్లాలోనే అత్యధిక యూనిట్లు
గ్రామీణాభివృద్ధ్ది శాఖ, సెర్ఫ్, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో జిల్లా లో అత్యధికంగా 516 యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే ఆయా యూనిట్ల కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతోపాటు ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపర్చాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలు నెరవేర్చేలా ముందుకు సాగుతున్నాం. జిల్లాలో మరో వంద యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నాం
రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నా..
పిండిగిర్నీకి ముందు ఇంటివద్దనే బీడీలు చుట్టేది. అంతంతమాత్రం గానే వచ్చే కూలీ డబ్బులతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం ఇచ్చిన రూ.40 వేల రుణంతో పిండి గిర్నీ ఏర్పాటు చేసుకున్నా. రోజుకు రూ.500 వరకు సంపాది ంచుకోగలుగుతున్న. కూలీ పనులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. నా భర్త సంపాదనకు నా సంపాదన తోడవ్వడంతో ఆర్థిక ఇబ్బందులు కూడా తీరినయి.
ఏడాది క్రితం వరకు చిన్నబట్టీపై తినుబండారాలను తయారు చేసే వాళ్లం. వాటిని అమ్మగా వచ్చిన ఆదాయంతో జీవి తం ఇబ్బందిగా సాగేది. ప్రభుత్వం అందించిన రూ.40 వేలతో వ్యాపారాన్ని విస్తరించుకున్నా. ఆ తర్వాత స్త్రీనిధి నుంచి రూ.2లక్షల రుణం ఇవ్వడంతో ప్యాకింగ్ మిషన్ కూడా కొనుక్కున్నాం. నిత్యం 100 కిలోలకు పైగా మిక్చర్, బూందీ వంటివి తయారు చుట్టు ఉన్న 30 ఊర్లలో కిరాణ దుకాణాలకు విక్రయిస్తున్నాం. ఖర్చులు పోను రూ.30-40 వేల వరకు మిగులు తున్నాయి. 40వేల అప్పు తీరింది. ప్రస్తుతం ఇంటిల్లిపాదికీ ఉపాధి దొరికి జీవితం సాఫీగా సాగుతున్నది. త్వరలోనే మరింత రుణాన్ని తీసుకుని వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నాం.
-ప్రమీల, మహిళా సంఘం సభ్యురాలు, బీబీనగర్