బొగ్గు బ్లాకులను ప్రైవేట్పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక లోకం కన్నెర్రజేసింది. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలు 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చాయి. బీజేపీ సర్కార్పై ఒత్తిడి తెచ్చేలా ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. సంస్థను కాపాడుకునేందుకు కలిసికట్టుగా ఆందోళన చేపట్టాయి. సింగరేణి వ్యాప్తంగా గురువారం తొలిరోజు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. భూగర్భ, ఓపెన్కాస్టు గనులు, డిపార్ట్మెంట్లు, కార్పొరేట్ కార్యాలయం వద్ద కార్మికులు, ఉద్యోగులు, అధికారులు నిరసన తెలిపారు. సింగరేణిలోని అన్ని జీఎం కార్యాలయాలు, కొత్తగూడెంలోని కార్పొరేట్ ప్రధాన కార్యాలయం హెడ్డాఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. 29,247 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. మొత్తం సంస్థ వ్యాప్తంగా 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీని విలువ రూ.80 కోట్లు ఉంటుంది. కార్మికులు వేతనాల రూపంలో రూ.20 కోట్లు నష్టపోయారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బొగ్గు బ్లాకులను ప్రైవేట్పరం చేయడం వల్ల సంస్థతోపాటు బొగ్గు ఆధారిత పరిశ్రమలన్నింటిపై ప్రభావం చూపుతుందన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ శక్తులకు బొగ్గు బ్లాకులు అప్పగిస్తే కార్మికుల సంఖ్య తగ్గిపోతుందని, కారుణ్య నియామకాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 9 : కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలోని నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేట్పరం చేయడాన్ని నిరసిస్తూ గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలు 72 గంటలకు సమ్మెకు పిలుపునిచ్చాయి. సింగరేణి వ్యాప్తంగా గురువారం తొలిరోజు సమ్మె విజయవంతమైంది. 11 ఏరియాల్లో ప్రీ షిఫ్ట్ నుంచి అన్ని భూగర్భ గనులు, ఓపెన్కాస్టు గనులు, డిపార్ట్మెంట్లు, కార్పొరేట్ కార్యాలయం వద్ద కార్మికులు, ఉద్యోగులు, అధికారులు నిరసన చేపట్టారు. సింగరేణిలోని అన్ని జీఎం కార్యాలయాలు, కొత్తగూడెంలోని కార్పొరేట్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. భోజన విరామ సమయం వరకు ధర్నా కొనసాగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేట్పరం చేయడం వల్ల కేవలం సంస్థకే నష్టం కాదని, బొగ్గు ఆధారిత పరిశ్రమలన్నింటిపై ప్రభావం చూపుతుందన్నారు. విద్యుత్ సంస్థలకు పెద్దఎత్తున నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. సిమెంట్ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కార్పొరేట్, ప్రైవేటు శక్తులకు బొగ్గు బ్లాకులు అందిస్తే వారికి ఇష్టానుసారంగా ధరలు పెంచుతారని పేర్కొన్నారు. భవిష్యత్లో కార్మికుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. ఇక నుంచి కారుణ్య నియామకాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకు జీతాలు తప్ప ఎలాంటి అలవెన్సులు వర్తించవని, ఉద్యోగ భద్రత ఉండదని, సీఎంపీఎఫ్ వర్తించదని, ఆస్పత్రి సౌకర్యం ఉండదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతు చట్టాలను ఎలా రద్దు చేసిందో దీనిని కూడా అలా రద్దు చేసే వరకు పోరాటం ఆగదన్నారు. కార్మికులకు క్షమాపణ చెప్పి సింగరేణికి బొగ్గు బ్లాకులు ఇచ్చే వరకు కార్మికులు పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కేవోసీలో సమ్మె విజయవంతం
టేకులపల్లి, డిసెంబర్9 : టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితలగనిలో కార్మిక సంఘం, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె తొలిరోజు ప్రశాంతంగా జరిగింది. సమ్మెను ఎస్సై రాజ్కుమార్ పర్యవేక్షించారు. మూడుషిఫ్ట్లో కలిపి 130 మంది హాజరు కావాల్సి ఉండగా.. ఫస్ట్, సెంకడ్ షిఫ్ట్లకు కలిపి అత్యవసర సిబ్బంది ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. కార్యక్రమంలో సింగరేణి కార్మిక సంఘం నాయకులు, అఖిలపక్ష నాయకులు కనుదుల వీరన్న, ధర్మపురి వీరబ్రహ్మాచారి, రేపాకుల శ్రీనివాస్, బానోత్ ఊక్లా, గుగులోత్ రాంచంద్రు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం తీరు మారాలి
రామవరం, డిసెంబర్ 9 : కొత్తగూడెం ఏరియాలో సింగరేణి కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో బొగ్గు గనులు బోసిపోయాయి. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం సింగరేణిలోని నాలుగు బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ టీబీజీకేఎస్ జాక్ ఆధ్వర్యంలో ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ నేతృత్వంలో సమ్మె విజయవంతమైంది. ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, కార్మిక సంఘాల జేఏసీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర పాలకులు కళ్లు తెరిచి నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వేలం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 11మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, పిట్ కార్యదర్శులు చిలక రాజయ్య, చెరిపల్లి నాగరాజు, ఎస్కే గౌస్, ఎండీ సత్తార్పాషా, శనిగరపు శంకర్, సీహెచ్ కుమార్, నటరాజ్, శేఖర్బాబు, సుద్దాల నరసింగం, సెంట్రల్ కమిటీ మెంబర్ సూరిబాబు, మోహన్రెడ్డి, విప్లవ్రెడ్డి, మురాద్, గోపు కుమారస్వామి, నిమ్మల రాజేశ్వరరావు, గజ్జి శ్రీనివాస్, వెజ్జాల శ్రీనివాస్, కొమరయ్య, కొండా లక్ష్మణ్, బోయపాటి నాగేశ్వర్రావు, నరసింహ, ఉమేశ్, కుమార్, కోళ్ల రమేశ్, ఉద్యోగులు, కార్యకర్తలు, డీఎల్ఆర్ కార్మికులు పాల్గొన్నారు. మైన్లు, డిపార్ట్మెంట్లు, ఓసీల్లో జరిగిన కార్యక్రమాల్లో జాతీయ సంఘాల నాయకులు ఏఐటీయూసీ నుంచి వీరస్వామి, ఐఎన్టీయూసీ నుంచి నాగభూషణం, హెచ్ఎంఎస్ నుంచి ఆంజనేయులు, సీఐటీయూ నుంచి మందా నరసింహారావు, బీఎంఎస్ నుంచి మాధవ్ నాయక్ పాల్గొన్నారు.
సమ్మెలో 29,247 కార్మికులు
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో మొదటి రోజు సమ్మెలో మొదటి షిఫ్ట్లో 27,559 మంది కార్మికులకు గాను 3,410 మంది అత్యవసర సేవలకు హాజరయ్యారు. 23,388 మంది సమ్మెలో పాల్గొన్నారు. రెండో షిఫ్ట్లో 7,218 మంది కార్మికులకు గాను 1,215 మంది అత్యవసర సేవలకు హాజరయ్యారు. 5,866 మంది సమ్మెలో పాల్గొన్నారు. మొదటి, రెండు షిప్టుల్లో 34,777 మంది కార్మికులకు గాను 4,620 మంది హాజరయ్యారు. 29,247 మంది సమ్మెలో పాల్గొన్నారు. మొత్తం సంస్థ వ్యాప్తంగా 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీని విలువ రూ.80 కోట్లు ఉంటుంది. కార్మికులు వేతనాల రూపంలో రూ.20 కోట్లు నష్టపోయారు.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఇలా..
కొత్తగూడెం ఏరియా 56,944 టన్నులు, ఇల్లెందు ఏరియా 20,038, మణుగూరు ఏరియా 38,963 టన్నులు, ఆర్జీ1 ఏరియా 13,196 టన్నులు, ఆర్జీ2 ఏరియా 25,943 టన్నులు, ఆర్జీ3 ఏరియా 21,481 టన్నులు, అడ్రియాలా ప్రాజెక్టు 6,926 టన్నులు, భూపాలపల్లి ఏరియా 15,815 టన్నులు, బెల్లంపల్లి 12,037 టన్నులు, మందమర్రి ఏరియా 18,604 టన్నులు, శ్రీరాంపూర్ ఏరియా 21,833 టన్నులు బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
అఖిలపక్షం ఆధ్వర్యంలో..
సత్తుపల్లి, డిసెంబర్ 9 : సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేట్పరం చేసేందుకు కేంద్రం నిర్ణయించడంతో సింగరేణివ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఇందులోభాగంగా తొలిరోజు గురువారం సమ్మె ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బొగ్గు పరిశ్రమలు, బీఎస్ఎన్ఎల్, బ్యాంకులు, ఎల్ఐసీ, రైల్వే, విమానాలు, ప్రభుత్వ పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని ఆరోపించారు. కేంద్రం దిగొచ్చే వరకు సమ్మె చేస్తామంటూ కార్మికులు ముక్తకంఠంతో నినదించారు. జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీలోని 774 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. జేవీఆర్ ఓసీలో రూ.3కోటు, కిష్టారం జేవీఆర్ ఓసీలో రూ.1.25 కోట్ల మేరకు బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు చెన్నకేశవరావు, మురళీ, భీమయ్య, వెంకట్, అజగర్ఖాన్, చంద్రశేఖర్, వెంకటరమణ, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, యూసఫ్, తడికమళ్ల యోబు, దండు ఆదినారాయణ పాల్గొన్నారు.
సమ్మెతో మూగబోయిన గనులు
మణుగూరు రూరల్, డిసెంబర్ 9 : బొగ్గుగనుల వేలం, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు సమ్మెకు దిగారు. టీబీజీకేఎస్ యూనియన్ సమ్మె పిలుపు మేరకు జాతీయ కార్మిక సంఘాలు సంఘీభావం పలకడంతో తొలిరోజు గురువారం కార్మికులు స్వచ్ఛందంగా విధులకు గైర్హాజరయ్యారు. దీంతో మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, ఇఫ్టూ నాయకులు రైల్వే గేట్ వద్ద నుంచి సమ్మెను పర్యవేక్షించారు. విధులకు హాజరయ్యే కార్మికులకు ఇబ్బందులు కలిగిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో సింగరేణి చెక్పోస్టులు, గని ప్రధాన ద్వారాల వద్ద సెక్యూరిటీ, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మణుగూరు ఏరియా బ్రాంచి ఉపాధ్యక్షుడు ప్రభాకర్రావు అధ్యక్షతన కార్మికులందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించారు. విధులకు దూరంగా ఉండి తమ ఐక్యతను చాటుకున్నారు. బొగ్గు బ్లాకుల వేలం తమ పరిధిలోనిది కాదని, కరోనా నేపథ్యంలో కంపెనీ వార్షిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని కార్మికులు విధులకు హాజరుకావాలని సింగరేణి అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ అత్యవసర సిబ్బంది మినహా కార్మికులు ఎవరూ విధులకు హాజరుకాలేదు.
పూర్తిగా నిలిచిపోయిన ఉత్పత్తి..
ఏరియాలోని అన్ని బొగ్గు గనుల్లో సుమారు 2,610 మంది కార్మికులు పలు విభాగాల్లో పనిచేస్తున్నారు. తొలిరోజు సమ్మెతో కార్మికులు విధుల్లోకి రాకపోవడంతో బొగ్గు ఉత్పత్తి, సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఓసీ-2 గనిలో 80 డంపర్లు, 15 షావల్స్, ఓసీ-4లో 20 డంపర్లు, 5 షావల్స్, డోజర్లు, గ్రేడర్లు పూర్తిగా నిలిచిపోయాయి. కేసీహెచ్పీలో బొగ్గు రవాణాకు ఆటంకం ఏర్పడింది. మొదటి, జనరల్ షిఫ్ట్ల్లో 1,824 మంది కార్మికులకు గాను మొదటి షిఫ్ట్లో 202 మంది అత్యవసర సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. రెండో షిఫ్ట్లో 389 మందికి 74 మంది హాజరయ్యారు. దాదాపు 30వేల టన్నులు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తొలిరోజు సమ్మెను లెవన్మెన్ కమిటీ మెంబర్ సామా శ్రీనివాసరెడ్డి, నాయకులు కోటా శ్రీనివాసరావు, అబ్దుల్ రవూఫ్, వీరభద్రం, అశోక్, అన్ని గనుల పిట్ సెక్రటరీలు, జేఏసీ నాయకులు రాంగోపాల్, జాన్, రవీందర్, పర్యవేక్షించారు.
కార్మికులకు ధన్యవాదాలు
చీకటి సూర్యుల బతుకుల్లో వెలుగులు ఆపాలని చూస్తే ఊరుకునేది లేదు. ఏకపక్షంగా కేంద్ర తీసుకున్న బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. సింగరేణి వ్యాప్తంగా నాలుగు బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని తలపెటిన 72 గంటల సమ్మెను తొలిరోజు విజయవంతం చేసిన ఉద్యోగులు, కార్మికులకు ధన్యవాదాలు.