కోదాడటౌన్, డిసెంబర్ 28 : కోదాడలో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు పరిపాలన అనుమతులు ఇస్తూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ కోర్టు సూర్యాపేటలో ఉండగా అక్కడి నుంచి హుజూర్నగర్కు మార్చారు. జిల్లా అదనపు కోర్టు సూర్యాపేటలో, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హుజూర్నగర్లో ఉండడంతో న్యాయవాదులు, కక్షిదారులకు ఇబ్బంది పడుతున్నారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించి అధిక కేసులు కోదాడ నుంచి నమోదు కావడంతో కోదాడ నుంచి హుజూర్నగర్కు వెళ్లాల్సి వస్తున్నది. కోదాడకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టును మంజూరు చేయాలని కోదాడ బార్ అసోసియేషన్ సభ్యులు 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కేసులు, పలు వివరాలను గుర్తించిన హైకోర్టు కోదాడకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అవసరమని పరిపాలన అనుమతులకు ఉత్తర్వులిచ్చింది.
సీనియర్ సివిల్ జడ్జి కోర్టుతో ప్రయోజనాలు
ఈ కోర్టు ఏర్పాటుతో కోదాడ ప్రాంతంలోని న్యాయవాదులు, కక్షిదారులకు ఉపశమనం కలుగనుంది. కింది కోర్టులో ఇచ్చే తీర్పుల్లో కొన్నింటిని అప్పీల్ చేసుకోవడానికి, హిందూ మ్యారేజ్ చట్టం, ఒరిజినల్ పిటిషన్, వారసత్వ దావాలు, రూ.30-50 లక్షల విలువ గల సివిల్ దావాలు, సెషన్స్కు సంబంధించిన క్రిమినల్ కేసులు ఈ కోర్టు పరిధిలోకి రానున్నాయి. ఇప్పటికే సుమారు 500కి పైగా కేసులు హుజూర్నగర్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఈ కోర్టు రాకతో వాటికి సత్వర పరిష్కారం లభించనుంది.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
కోదాడకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు కావడంపై బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం రాత్రి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్కు సహకరించాలని కోరారు.
ఇబ్బందులు తొలగనున్నాయి
కోదాడకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరుతో న్యాయవాదులు, కక్షిదారులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇప్పటి వరకు కోదాడ నుంచి 500 పైగా కేసులు హుజూర్నగర్ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఈ కోర్టులో కేసులన్నీ పరిష్కారం చేసుకోవచ్చు. కోదాడ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. బార్ అసోసియేషన్ సభ్యులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-దేవబత్తిని నాగార్జున, కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు