మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతీ డివిజన్ను అభివృద్దిలో అగ్రగామిగా నిలపటమే తన లక్ష్యమని , ఇందుకోసం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ల తోడ్పాటుతో అధిక నిధులు మంజూరు చేయిస్తూ ముందుకు సాగుతున్నట్లు విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కరోనాతో రెండేళ్లుగా విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి సౌకర్యానికి ఎక్కడా లోటు రాకుండా తమ ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నదన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్లో రూ. 4,70,50,00 నిధులు, ఆల్విన్ కాలనీ డివిజన్లో రూ. 4.21 కోట్లతో చేపట్టబోయే యూజీడీ పునరుద్ధరణ పనులకు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, దొడ్ల వెంకటేశ్ గౌడ్లు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేరువేరు డివిజన్లలో విప్ గాంధీ మాట్లాడుతూ ఏండ్ల తరబడి నెలకొన్న మురుగు ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఆన్ని కాలనీలకు యూజీడీ వ్యవస్థను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజల సౌకర్యం కోసం ఎన్నో మౌలిక సదుపాయాల కల్పనను చేపట్టినట్లు, ప్రతీ వీధికి వీటిని విస్తరించే వరకు తాను శ్రమిస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. సౌకర్యవంతమైన రహదారులు, మురుగునీరు నిల్వలేని దారులు, ప్రతి ఇంటికీ తాగునీరు , క్షణం అంతరాయం లేకుండా విద్యుత్, ఆహ్లాదాన్నందించే పచ్చదనపు చెరువుల పరిసరాలు లక్ష్యంగా విస్తృతంగా పనులు చేపడుతున్నామని విప్ గాంధీ పేర్కొన్నారు.
ప్రజల సౌకర్యం చేపడుతున్న నిర్మాణ పనులలో నాణ్యతలో రాజీ పడవద్దని , ఎక్కువ కాలం మన్నికతో సేవలు లభించేలా పూర్తి చేయాలని అధికారులకు విప్ గాంధీ సూచించారు. నిర్మాణాల సందర్భంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల పార్టీ నేతలు జిల్లా గణేశ్, దొడ్ల రామకృష్ణ గౌడ్, పురుషోత్తం యాదవ్, గంగాధర్రావు పాల్గొన్నారు.