కాచిగూడ : అయినవాళ్లు కాదనుకుని వదిలిపెట్టి వెళ్లిపోయిన వృద్దురాలిని కాచిగూడ పోలీసులు చేరదీసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల ప్రకారం గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వృద్దురాలు (75)ను ఆమె బంధువులు గురువారం ఉదయం కాచిగూడ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టి పోయారు.
దీంతో ఆ వృద్దురాలు ఆకలితో అలమటిస్తుండగా కాచిగూడ అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్, కానిస్టేబుల్ గౌరిశంకర్ గుర్తించి ఆమెకు నీళ్లు, ఆహారం తినిపించి ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన వృద్ధాశ్రమానికి తరలించారు. ఈ సందర్భంగా అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ అపదలో ఉన్న వ్యక్తులను అదుకున్నప్పుడే మనిషి జీవితానికి సార్ధకత ఏర్పడుతుందని అన్నారు. కాగా తమ మానవత్వాన్ని చాటుకున్న పోలీసులను పలువురు అభినందించారు.