రైతుబంధు సంబురాలు అంబరాన్నంటాయి. గురు వారం ఊరూరా ఉత్సాహంగా ఉత్సవాలు జరిగాయి. అన్న దాతల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇండ్లు, పాఠశాలలు, రైతువేదికల లోగిళ్లు రంగురంగుల ముగ్గులతో మెరిసిపోయాయి. సంక్రాంతి పర్వదినం ముందే వచ్చిందా.. అన్నట్లు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. ఏ పల్లెకెళ్లినా సరస్వతీ నిలయాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించగా..సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. వ్యవసాయ క్షేత్రాల్లో రైతుబంధు అక్షరాల రూపంలో పంటను పేర్చి టీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతన్నలకు ఉన్న అభిమానాన్ని చాటుకు న్నారు. వనపర్తి జిల్లా పెద్దగూడెం తండా శివారులోని వేరుశనగ పొలంలో సంప్రదాయ దుస్తులతో గిరిజన మహిళలు జై కొట్టారు. జై తెలంగాణ.. జైజై కేసీఆర్ అంటూ నినదించారు.
రైతుబంధు డబ్బులు ఖాతాల్లో జమ అవుతుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.. ఉమ్మడి జిల్లాలో ఊరూరా సంబురాలు చేసుకుంటున్నారు.. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు.. పాఠశాలల్లో విద్యార్థులు ముగ్గులపోటీలు, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో హుషారుగా పాల్గొంటున్నారు.. రైతులు, టీఆర్ఎస్ నాయకులు పొలాల్లో పార్టీ జెండాలతో జై తెలంగాణ.. జైజై కేసీఆర్.. అని నినాదాలు చేస్తున్నారు.. గ్రామాల్లో ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించారు.. వ్యవసాయ క్షేత్రాల్లో రైతుబంధు అక్షరమాలలతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతన్నలు తమఅభిమానాన్ని చాటుతున్నారు.
ఆకట్టుకున్న తెలంగాణ బతుకు చిత్రాలు
వనపర్తి, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో రైతులు, ప్రజలు పడిన బాధలు వర్ణణాతీతం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన వ్యవసాయ సంస్కరణలు, అమలు చేసిన పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాయి. వ్యవసాయం దండుగ అన్న స్థితి నుంచి పండుగ అనే స్థాయికి చేరుకున్నది. రైతుబంధు పేరుతో అందిస్తున్న పెట్టుబడి సాయం సిరులు కురిపిస్తున్నది. అప్పులు తీసుకునే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే దిశగా అభివృద్ధి చెందుతున్నారు. ఈ విషయాలన్నింటినీ వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి-జంగమాయపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు కళ్లకు కట్టినట్లు చిత్రాలు వేశారు. చిన్న వయస్సులోనే పరిపక్వతతో వేసిన పేయింటింగ్స్ గతానికి, వర్తమానానికి దర్పణం పడుతున్నాయి. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు తెలంగాణ బతుకు చిత్రాలను ఆవిష్కరించారు. మట్టితో రైతుల ప్రతిమలను తయారుచేశారు.