ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మార్చడంతో కర్షకలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది. పంట పెట్టుబడికి రైతుబంధు అందిస్తుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు సాగుతున్నాయి. శనివారం రైతు పక్షపాతి సీఎం కేసీఆర్కు అన్నదాతలు జై కొట్టారు. జై టీఆర్ఎస్, జైజై తెలంగాణ అంటూ నినదించారు. ఊరూవాడా.. ఉత్సాహంగా రైతుబంధు పండుగ జరుపు కొన్నారు. రైతువేదికలు, ఇండ్ల లోగిళ్లను అందమైన రంగవల్లులతో అలరించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు, రైతులు క్షీరాభిషేకం చేశారు. గద్వాల మార్కెట్ యార్డులో సంబురాలు నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి కర్షకులు, మార్కెట్ అధికారులు క్షీరాభిషేకం చేయగా.. వరి, వేరుశనగ, కందులు, పెసర్లు, టమాటా, దొండకాయలతో సీఎం, ఎమ్మెల్యే చిత్రాలను ప్రత్యేకంగా గీసి అభిమానాన్ని చాటుకున్నారు. గండీడ్ మండలం చౌదర్పల్లి గ్రామంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎండ్లబండ్లపై ఊరేగింపుగా వచ్చారు.
రైతుబంధు సంబురాలు కొనసాగుతున్నాయి.. ఊరూవాడా ఉత్సాహంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు ఎంతో ఉల్లాసంగా పాలుపంచుకుంటున్నారు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు, జలాభిషేకాలు చేస్తున్నారు.. గ్రామాల్లో, మండలకేంద్రాల్లోని రంగవల్లుల పోటీల్లో మహిళలు, విద్యార్థినులు పాల్గొని తెలంగాణ ఏర్పాటుకు ముందు.., తర్వాత అర్థమయ్యే రీతిలో చూడముచ్చటగా ముగ్గులు వేస్తున్నారు.. పంట ఉత్పత్తులతో జై రైతుబంధు, జైజై కేసీఆర్ అని అక్షరమాలను పేర్చి టీఆర్ఎస్ సర్కార్పై ఉన్న ప్రేమను చాటుతున్నారు.. వారోత్సవాల్లో భాగంగా పలు చోట్ల మొక్కలు నాటుతుండగా.. మరికొన్ని చోట్ల రైతులను సన్మానిస్తున్నారు..