డంపింగ్ యార్డు పనుల పరిశీలన
పీర్జాదిగూడ, డిసెంబర్ 3: పీర్జాదిగూడ నగరపాలక సంస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మేయర్ జక్క వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. నగరపాలకలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ పరిధి… పర్వతాపూర్లో నిర్మిస్తున్న డంపింగ్ యార్డులో జరుగుతున్న పనులతో పాటు చెత్త సెగ్రిగేషన్ పనితీరును మేయర్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, ఏఈ. వినీల్, వర్క్ ఇన్స్పెక్టర్స్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
పీర్జాదిగూడ పరిధి…19వ డివిజన్ మౌలానా ఆజాద్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ యూనివర్సల్, ఎన్టీఆర్ ట్రస్ట్, కేరళ ఆయుర్వేదిక్ సెంటర్, కార్పొరేటర్ అల్వాల సరితా దేవేందర్ ఆధ్వర్యంలో కలపాటి సాంబమూర్తి డీపీఎమ్వో జ్ఞాపకార్థం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మేయర్ వెంకట్రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులను అందజేశారు.