బేగంపేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నడుం బిగించారు. ఈ మేరకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ నాయకులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. శ్రీనివాసయాదవ్ ఆదేశాల మేరకు పాఠశాలల్లో సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ మేరకు సోమవారం బేగంపేట్ డివిజన్లోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీలోని రౌండ్టేబుల్, పాటిగడ్డలోని బండిమ్మెట్ ప్రభుత్వ పాఠశాలలను బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరిశ్రీహరి సందర్శించారు. ఈ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులతో కలిసి సమస్యలపై చర్చించారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏయే సౌకర్యాలు చేపట్టాలో అడిగి తెలుసుకున్నారు.
కాగా ఓల్డ్ కస్టమ్స్ బస్తీలోని పాఠశాలలో ఫ్లోరింగ్, టాయ్లెట్స్ సంబంధించి పైపులైన్ల ఏర్పాటు, సివరేజ్లైన్ అలాగే పాటిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో తరగతి అదనపు గదులు ఏర్పాటు చేయాల్సి ఉందని పాఠశాల నిర్వహాకులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను వెంటనే మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్టు కార్పొరేటర్ తెలిపారు.