వికారాబాద్ జిల్లాలో పకడ్బందీ చర్యలు
తాండూరు, వికారాబాద్లకు బస్తీ దవాఖానలు మంజూరు
జిల్లాలోని సర్కారు దవాఖానల్లో అందుబాటులో 510 బెడ్లు
తాండూరు జిల్లా దవాఖానలో 1000 లీటర్లు, డీసీహెచ్లో 500 లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ట్యాంకులు
జిల్లాలోని వైద్యశాలల్లో 21వేల ఐసొలేషన్ కిట్లు, జిల్లా వ్యాక్సిన్ కేంద్రంలో 5వేల కిట్లు
జిల్లా వ్యాప్తంగా పెంచిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ల కేంద్రాలు
పరిగి, జనవరి 4 :కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు వికారాబాద్ జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. వైరస్ విషయంలో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ పట్టణ ప్రాంతాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో జిల్లాలోని తాండూరు, వికారాబాద్ పట్టణాలకు బస్తీ దవాఖానలను మంజూరు చేసింది. అంతేకాకుండా జిల్లాలోని సర్కారు దవాఖానల్లో సుమారు 510 బెడ్లనూ అందుబాటులో ఉంచింది. తాండూరు జిల్లా దవాఖానలో 1000 లీటర్లు, డీసీహెచ్లో 500 లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ట్యాంకులు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో తాండూరు జిల్లా దవాఖాన, నాలుగు సీహెచ్సీలు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 21 వేల హోం ఐసొలేషన్ కిట్లను అందుబాటులో ఉంచారు. వికారాబాద్ వ్యాక్సిన్ నిల్వ కేంద్రంలో 5వేల ఐసొలేషన్ కిట్లను నిల్వ ఉంచినట్లు అధికారులు తెలిపారు. వైరస్ సోకినవారి వివరాలను త్వరితగతిన తెలుసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను సైతం పెంచారు.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను పూర్తిస్థాయిలో ఎదుర్కొనేందుకు సర్కారు సిద్ధమైంది. వికారాబాద్ జిల్లాలో అవసరమైన మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. సర్కారు దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లను పెంచడంతోపాటు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఆయా జిల్లాల్లోనే ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను పెంచింది. మరోవైపు ఐసొలేషన్ కిట్లు ప్రతి దవాఖానలో అందుబాటులో ఉండేలా వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచింది. తాండూరులోని జిల్లా దవాఖాన, పరిగి, వికారాబాద్, కొడంగల్, మర్పల్లిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
జిల్లాలోని సర్కారు దవాఖానల్లో 510 బెడ్లు
వికారాబాద్ జిల్లా పరిధిలోని సర్కారు దవాఖానల్లో సుమారు 510 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. తాండూరులోని జిల్లా దవాఖానలో 200 బెడ్స్, మాతాశిశు సంరక్షణ కేంద్రంలో 150, పరిగి సీహెచ్సీలో 50, కొడంగల్ సీహెచ్సీలో 50, వికారాబాద్ సీహెచ్సీలో 30, మర్పల్లి సీహెచ్సీలో 30 బెడ్స్ ఉన్నాయి. వీటిలో తాండూరులోని జిల్లా దవాఖానలో సుమారు 100 బెడ్స్ ఆక్సిజన్ బెడ్లుగా మార్పు చేశారు. ఇక్కడ 1000 లీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్ ట్యాంకు ఉన్నది. తాండూరు మాతా శిశు సంరక్షణ కేంద్రంలోనూ 500 లీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్ ట్యాంకు ఉన్నది. సీహెచ్సీల్లో 5 నుంచి 6 వరకు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతగిరిలోనూ ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా పెంచిన ఆర్టీపీసీఆర్ టెస్ట్లు..
వికారాబాద్లో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రం ఉండడంతో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్సీలు, జిల్లా దవాఖానల్లో పేషెంట్లు నుంచి సేకరించిన శాంపిల్స్ వికారాబాద్ పంపించి పరీక్షలు చేయిస్తారు. ప్రతిరోజూ ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి 15 నుంచి 20 ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ పంపించాలని, సీహెచ్సీల ద్వారా రోజు 50 నుంచి 80 శాంపిల్స్, తాండూరు దవాఖాన ద్వారా సుమారు రోజుకు వంద వరకు శాంపిల్స్ పంపించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. తద్వారా రోజు 600 నుంచి 800 వరకు శాంపిల్స్ సేకరణకు అధికారులు నిర్ణయించారు. దీంతో ఎప్పటికప్పుడు వైద్యం అందించేందుకు ఈ టెస్ట్ల సంఖ్య పెంచారు.
జిల్లాలో 26వేల హోం ఐసొలేషన్ కిట్లు…
జిల్లా పరిధిలో కరోనా రోగులకు చికిత్స కోసం అందజేసే హోం ఐసొలేషన్ కిట్ల సంఖ్యను పెంచారు. తాండూరులోని జిల్లా దవాఖాన, నాలుగు సీహెచ్సీలు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొత్తం 21,000 హోం ఐసొలేషన్ కిట్లు అధికారులు అందుబాటులో ఉంచారు. వికారాబాద్ వ్యాక్సిన్ నిలువ కేంద్రంలో 5వేల ఐసొలేషన్ కిట్లు నిల్వ ఉంచారు.
జిల్లాకు రెండు బస్తీ దవాఖానలు…
ప్రజలకు మరింత మెరుగైన, చేరువగా వైద్యం అందించేందుకు సర్కారు నిర్ణయించింది. జిల్లా పరిధిలోని తాండూరు, వికారాబాద్ పట్టణాలకు ఒక్కొక్కటి చొప్పున బస్తీ దవాఖానలు మంజూరు చేశారు. ఈ బస్తీ దవాఖానల్లో డాక్టర్లతోపాటు ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటారు.
వ్యాక్సినేషన్ వేగవంతం..
కరోనా నుంచి రక్షణ కోసం టీకాలు వేసే కార్యక్రమాన్ని అధికారులు వేగవంతం చేశారు. జిల్లా పరిధిలో 18 ఏండ్లు పైబడిన వారు 7,09,526 మంది ఉండగా మొదటి డోసు టీకాలు 99 శాతం మందికి వేశారు. ఇప్పటివరకు రెండవ డోసు టీకాలు వేయడం 45శాతం పూర్తయింది. ఈనెల 3వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏండ్ల మధ్య వయస్సు గల వారందరికీ టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమైంది. 27 దవాఖానల్లో టీనేజర్లకు టీకాలు వేస్తున్నారు. మొదటి రోజు 521 మందికి టీకాలు వేశారు.
అన్ని ఏర్పాట్లు చేపట్టాం..
ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాం. జిల్లా పరిధిలోని 27 దవాఖానల్లో 510 బెడ్స్ ఉన్నాయి. తాండూరులోని జిల్లా దవాఖానలో వెయ్యి లీటర్లు, ఎంసీహెచ్లో 500 లీటర్ల సామర్థ్యంతో కూడిన ఆక్సిజన్ ట్యాంకులు ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాం. జిల్లా వ్యాప్తంగా 26వేల హోం ఐసొలేషన్ కిట్లు అందుబాటులో ఉంచాం.