గోల్నాక : గత 15 ఏండ్లుగా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న జీ.కిషన్రెడ్డి హయాంలో జరగని అభివృద్ధి కేవలం మూడేండ్లలోనే చేసి చూపించామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం అంబర్పేట చెన్నారెడ్డినగర్ ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో అంబర్పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్ధ్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు.
కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్, మాజీ కార్పొరేటర్లు కె.పద్మావతి, గరిగంటి శ్రీదేవి, పులిజగన్, సీనియర్ నాయకులు డాక్టర్ సులోచన, రంగారెడ్డి, బద్ధుల శిరీశ తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. ముందుగా టీఆర్ఎస్ ప్లీనరీలో చర్చించిన అంశాలను, అభివృద్ధి కార్యక్రమాల గురించి కార్యకర్తలకు వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వతా టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాయచూర్, నాందేడ్ నియోజవర్గాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారన్నారు. గతంలో రూ. 3లక్షలకు ఉన్న ఎకరా భూమి ప్రస్తుతం రూ.3కోట్ల పలుకుతోందని ఇది బంగారు తెలంగాణ దిశగా అడుగులు కావా .. అని ఆయన ప్రశ్నించారు. తలసరి ఆదాయం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సన్న బియ్యం, రైతు బంధు, దళిత బంధుతో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే నెంబర్వన్గా ఉన్నామన్నారు.
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎదురు దాడులకు దిగుతుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. కేవలం సీఎం కేసీఆర్ కుటుంబాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఇక వారి ఆటలు సాగవని ఎప్పటి కప్పుడు బీజేపీ ఆరోపణలను తిప్పి కొట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే తాను అధికారంలోకి వచ్చిన మూడేండ్ల కాలంలోనే నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ల ఏర్పాటు, వీధిదీపాలు, పార్కుల సుందరీకరణ, కమ్యూనిటీ హాల్ల ఏర్పాటు తదితర మౌళిక వసుతులు కొన్ని కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశామన్నారు.
తాను హామీ ఇచ్చిన ప్రకారం హిందూ, ముస్లిం శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టేందుకు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్ సహకారంతో రూ.50 కోట్లతో మూసారాంబాగ్ బ్రిడ్జ్, రూ.50కోట్లతో గోల్నాక ఫ్లైఓవర్, రూ.30 కోట్లతో నల్లకుంట రత్నానగర్ రిటర్నింగ్ వాల్, రూ.30కోట్లతో నల్లకుంట అచ్చయ్యనగర్ రిటర్నింగ్వాల్తో పాటు బాపునగర్ నుంచి ప్రేమ్నగర్ నాలా విస్తరణ పనులకు నిధులు కేటాయించారన్నారు.
త్వరలోనే వీటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి మరే ఇతర పార్టీలు దరిదాపుల్లోకి రాకుండా పార్టీ శ్రేణులు కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే నెల 15న వరంగల్లో నిర్వహించే విజయగర్జనకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో అంబర్పేట, బాగ్అంబర్పేట, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట డివిజన్ల అధ్యక్షులు సిద్ధార్థ్ ముదిరారాజ్, చందు, కొమ్ముశ్రీను, భీష్మదేవ్, మేడిప్రసాద్తో పాటు సీనియర్ నాయకులు లవంగు ఆంజనేయులు, లింగంగౌడ్, మోర శ్రీరాములుముదిరాజ్, యాసిన్, నరసింహ్మరెడ్డి, ప్రవీణ్పాటిల్, మహేశ్ముదిరాజ్, ఆర్కే బాబు, అఫ్రోజ్పటేల్ తదితరులు పాల్గొన్నారు.