సికింద్రాబాద్ : భర్త తనపై చేయిచేసుకోవడంతో మనస్థాపానికి గురైన ఓ గృహిణి ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి అదృశ్యమైంది. బోయిన్పల్లి ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దలచ్చన్నగారి కాసీంరెడ్డి వ్యాపారి. గత కొన్ని సంవత్సరాల క్రితం కాసీంరెడ్డికి వంశిక (35)తో వివాహం జరిగింది.
అప్పటినుంచి ఈ దంపతులు న్యూ బోయిన్పల్లి సీతారాంపురం శ్రీనివాసానగర్ కాలనీలో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా వీరి మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 8 న సాయంత్రం 6:30 గంటలకు వారంతపు సంతకు వెళ్లిన వంశిక 8:30గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగివచ్చి అరగంటపాటు బెడ్రూంకు లోపలినుంచి గడియవేసుకుని అందులోనే ఉంది.
ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో కాసీంరెడ్డి, వంశికపై చేయిచేసుకున్నాడు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె రాత్రి 10:30గంటల సమయంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి అదృశ్యమైంది. కాసీంరెడ్డి ఫిర్యాదుమేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.