హిమాయత్నగర్ : చదువుల్లో చురుకైన ఓ విద్యార్థినికీ పై చదువులు చదవడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యం ఒక వైపు.. కుటుంబ ఆర్థిక పరిస్థితి మరోవైపు ఉండటంతో ఆ విద్యార్థిని ఏం చేయాలో తోచక కొట్టుమిట్టాడుతుంది.
నగరంలోని విద్యానగర్ టీఆర్టీ క్వార్టర్స్లో నివాసం ఉండే తట్టా సుధాకర్, మహేశ్వరిలది నిరుపేద కుటుంబం. ఈ దంపతుల కుమార్తె తట్టా శ్రావణికి చదువంటే ఎంతో ప్రాణం. చిన్నతనం నుంచి చదవులో ప్రథమ స్థానంలో ఉండి పదో తరగతిలో 8.3 మార్కులు సాధించింది.
కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ బైపీసీ చదివి 864 మార్కులు సాధించింది. నీట్-2020 ఎంట్రన్స్లో మంచి ర్యాంకు తెచ్చుకుంది. ఫిలిఫ్ఫైన్స్ దేశంలోని షీబూ ప్రాంతంలో గల సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది.
కానీ ఎంబీబీఎస్ చదువును కొనసాగించలేని పరిస్థితి ఆమెది. ఫీజులు కట్టక పోవడంతో పాటు ఇతరత్రా ఖర్చులకు డబ్బులు లేని కారణంగా ఆమె చదువు మధ్య లోనే మానేసే పరిస్థితి నెలకొంది. శ్రావణి తల్లిదండ్రులు బ్యాంకులో లోన్ తీసుకుని అష్టకష్టాలు పడి విడతల వారిగా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం కాలేజీ ఫీజును చెల్లించారు.
ప్రస్తుతం ఆమె రెండో సంవత్సరం చదువుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆన్లైన్లోనే మొదటి సంవత్స రాన్ని ఇంటి నుంచి పూర్తి చేసేందుకు యూనివర్సిటీ అనుమతి ఇచ్చింది. ఆన్లైన్లోనే చదివిన శ్రావణి మొదటి సంవత్సరం అన్ని సెమిస్టర్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి ఉన్నత శ్రేణిలో పాసైంది.
ఎంబీబీఎస్ రెండో విద్యాసంవత్సరానికి ఫీజులు కట్టే పరిస్థితి లేక పోవడంతో శ్రావణి చదువు మధ్యలోనే నిలిచిపోయింది.
దాతలు సహాయం చేస్తే చదువుకుంటా… శ్రావణి
ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇప్పటివరకు చదువుపై మక్కువతో చదువుకున్నాను. ఫిలిఫ్ఫైన్స్ దేశంలో ఐదేండ్ల ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయాలంటే సుమారు రూ.50లక్షల వరకు ఖర్చు అయ్యేఅవకాశం ఉంది.
మొదటి ఏడాది ఆన్లైన్లో పూర్తి చేసే సరికి రూ.10లక్షల వరకు ఖర్చు వచ్చింది. ఉన్నత విద్యను అభ్యసించి నా కుటుంబ పరిస్థితి మెరుగు పరచాలన్నదే నాలక్ష్యం. దాతలు ఆర్థికంగా తనను ఆదుకుని చేయూతనందిస్తే చదువుకుని వైద్య విద్యను పూర్తిచేస్తాను. .