బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం 9లోని సత్వా ఎన్క్లేవ్ సొసైటీలో ఖరీదైన ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నించిన వారిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు కబ్జాదారులు ఏర్పాటు చేసిన భారీ కంటెయినర్ను సీజ్ చేశారు.
షేక్పేట మండల సర్వే నెం 403లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం యూఎల్సీ ల్యాండ్గా నమోదయిన సుమారు 900 గజాల స్థలాన్ని మువ్వా రవింద్రనాథ్, లక్ష్మీబాయి తదితరులు మరోసారి కబ్జాలోకి తీసుకునేందుకు సోమవారం తెల్లవారుజామున ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు నిందితులు భారీ కంటెయినర్ను తీసుకువచ్చారు. ఈ కంటెయినర్ను సీజ్ చేసిన పోలీసులు క్రేన్ ద్వారా అక్కడినుంచి తరలించారు.
సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించి కంటెయినర్ను తీసుకువచ్చిన వాహనాన్ని, కబ్జాకోసం వచ్చిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మువ్వా రవింధ్రనాథ్తో పాటు మిగిలిన వారికోసం గాలింపు చేపట్టారు.