ఎస్సారెస్పీ ఆయకట్టు కింద యాసంగి పంటల సాగుకు గోదావరి జలాల నీటి విడుదల తేదీలు ఖరారయ్యాయి. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఏడు విడుతల్లో నీళ్లించేందుకు ఇరిగేషన్ శాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. ఆ మేరకు ఈ నెల
27న బయ్యన్న వాగు నుంచి తొలి విడుత ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 56 రోజుల్లో 3.36 లక్షల క్యూసెక్కులు.. అంటే 29.03 టీఎంసీలు ఇవ్వనున్నారు.
సూర్యాపేట, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఎస్సారెస్పీ ఆయకట్టు కింద యాసంగి సాగు కోసం 56 రోజుల పాటు గోదావరి జలాలు విడుదలకు నీటిపారుదల శాఖ షెడ్యూల్ ఖరారు చేసింది. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఆరు తడి పంటల సాగుకు నీటిని అందించనున్నారు. తొలి విడుత సోమవారం నుంచి నీటి విడుదల ప్రారంభం కానుంది. యాసంగిలో ధాన్యం కొనబోమని కేంద్రం ప్రకటించడంతో ఇతర పంటల సాగు వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మూడేళ్లుగా ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో భూములు సస్యశ్యామలం అయ్యాయి. ఇది కాస్త కేంద్ర ప్రభుత్వ వైఖరితో మూన్నాళ్ల ముచ్చటగా మారింది. గత్యంతరం లేక ప్రస్తుతం రైతులు ఆరుతడి పంటలు వేయించి నిర్ణయించారు. దాంతో గోదావరి జలాలను సైతం ఆరు తడి పంటలకు సరిపడేలా విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఆరుతడి పంటలే వేసుకోవాలి
జిల్లాలోని శ్రీరాంసాగర్ ఆయకట్టు రైతులు వరికి బదులు ఇతర పంటలు వేయాలని అధికారులు స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేయనప్పుడు ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అందుకే ఇతర పంటలు వేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచించి ఆరు తడి పంటలకు సరిపడా నీటిని విడుదల చేయాలని నిర్ణయించినందున రైతులు మొండిగా వరి సాగు చేస్తే ఇబ్బందులు తప్పవని అధికారులు అంటున్నారు.
56 రోజులు..
ఈ యాసంగికి ఆన్ అండ్ ఆఫ్ పద్ధ్దతిలో 56 రోజులు మాత్రమే నీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ శాఖ తెలిపారు. ఈ నెల 27న తొలి విడుత వరంగల్ జిల్లా బయ్యన్నవాగు నుంచి సూర్యాపేట జిల్లాకు నీటిని విడుదల చేయనున్నారు. 7 విడుతలుగా ఒక్కో విడుతలో ఎనిమిది రోజుల చొప్పున మొత్తం 56 రోజులు నీటిని విడుదల చేయనున్నారు.