ఖైరతాబాద్ : తెలంగాణ ఆడపడుచులు భక్తి శ్రద్దలతో జరుపుకునే బతుకమ్మకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి ఏడాది వేలాది మంది బతుకమ్మలను నిర్ణీత ఘాట్ల వద్ద నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఖైరతాబాద్ సర్కిల్ 17 పరిధిలోని జలవిహార్ వద్ద ఉన్న బతుకమ్మ పాండ్, పీవీ నరసింహారావు విగ్రహం ఆవరణలో కట్టమైసమ్మ దేవాలయానికి ఆనుకొని ఉన్న మరో ఘాట్ వద్ద జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది.
ఎంగిలిపూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు నిత్యం సాయంత్రం వేళల్లో ఇక్కడ పెద్ద సంఖ్యలో నిమజ్జనోత్సవాలు జరుగుతాయి.
ఇంజినీరింగ్, సానిటేషన్ ఏర్పాట్లు
జలవిహార్, కట్టమైసమ్మ దేవాలయం వద్ద ఉన్న బతుకమ్మ ఘాట్ల వద్ద హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ లోని ఇంజినీరింగ్, సానిటేసన్ విభాగాలు ప్రత్యేక చర్యలు చేపడుతాయి. ఘాట్ల వద్ద దెబ్బతిన్న మెట్లు, ఫ్లాట్ఫాం తదితర వాటి మరమ్మతులను చేస్తున్నారు.
సానిటేషన్ సిబ్బంది అక్కడ పేరుకపోయిన వ్యర్థాలను తొలగించే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇటీవల గణేశ్ నిమజ్జనం సందర్భంగా వ్యర్థాలను తొలగించగా, మరింత మెరుగులు దిద్దుతూ పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు.