సూర్యాపేట, డిసెంబర్ 15 : గరుడ యాప్కు కేంద్ర ఎన్నికల సంఘం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, దానిని జనంలోకి తీసుకెళ్లాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక గోయల్ సూచించారు. బుధవారం కుడకుడలోని నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ పరిధిలో రూ.1.30 కోట్లతో నిర్మించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్లో ఏ ఎన్నికలనైనా ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు ఈ గరుడ యాప్ ఉపయోగ పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. 22 జిల్లాల్లో స్ట్రాంగ్ రూమ్ల నిర్మాణం చేపట్టగా 20 జిల్లాల్లో పూర్తయినట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్లు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు భద్రపర్చేందుకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ప్రస్తుతం నిర్మించిన భవనం పైనే మరో అంతస్తు కావాలని జిల్లా అధికారులు కోరినందున అందుకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన వారి పేర్లను తొలగించాలని సూచించారు. 2022 జనవరి 1 నాటికి జిల్లాలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ సంతృప్తికరంగా ఉందన్నారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో చేర్పులు, మార్పులకు సంబంధించి 10,764 దరఖాస్తులు అందినట్లు చెప్పారు. వాటిలో 9,874 దరఖాస్తులను పరిష్కరించామని, మిగతా 917 దరఖాస్తులను త్వరలోనే పరిశీలిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా గరుడ యాప్పై మొదటి దశ శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, కిశోర్కుమార్, వెంకారెడ్డి, ఆర్అండ్బీ ఈఈ యాకూబ్, డీఈ మహిపాల్రెడ్డి, తాసీల్దార్లు పాల్గొన్నారు.