ఎల్బీనగర్ : వినాయక ఉత్సవాల్లో భాగంగా ప్రతియేటా గణనాధుని లడ్దు వేలం జరుగడం, భారీ డిమాండ్ పలుకడం సర్వసాధారణం. ఇది ఎప్పటి నుంచో అనవాయితీగా సాగుతోంది. అయితే గణనాధుని లడ్డుకే కాదు గణేషుడి పూజల్లో వాడిన వస్తువులకూ డిమాండ్ పెరుగుతోంది. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణేషుడి మెడలోని కరెన్సీ దండను వేలం వేయగా లక్ష వరకు పలకడం విశేషం.
లింగోజిగూడ డివిజన్ కర్మన్ఘాట్లోని మాధవరం సెరినిటీ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుని చేతిలోని లడ్డూ వేలంలో రూ. 6 లక్షలకు తేనేటి భాస్కర్రెడ్డి దక్కించుకోగా వినాయకుడి మెడలోని కరెన్సీ దండను రూ. 1,05,000లకు డీజే వినీష్ దక్కించుకున్నారు. అదే విధంగా కలశం చెంబును కూడా వేలంలో రూ. 15 వేలకు వినయ్ దక్కించుకున్నారు.
ఈ కార్యక్రమంలో గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు అనంత రవీంద్ర, మాలే రాజశేఖర్, దూసరి రాజు, అలంపల్లి రమేష్, సత్తయ్య గౌడ్, గట్టుపల్లి శ్రీనివాస్, సాయినంద, తుడా శ్రీనివాసరెడ్డి, మాస నగేష్, పేట సురేష్, జీల విజయసాగర్, అనిరుద్, మాధవరం సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.