చిల్లర మాటలు మానుకోవాలని కాషాయ నేతలకు ఎమ్మెల్యే హెచ్చరిక
సికింద్రాబాద్, డిసెంబర్ 4: జీహెచ్ఎంసీలో మాదిరిగానే కంటోన్మెంట్లో ఉచితంగా తాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమైందని ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా బోర్డు అధికారులతో జలమండలి అధికారులు సంప్రదింపులు జరిపారని, త్వరలోనే ఉచిత తాగునీటి సరఫరాపై అధికారులు వెల్లడించే అవకాశం ఉందన్నారు.శనివారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో మారేడ్పల్లికి చెందిన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు సాయన్నతో సమావేశమయ్యారు. పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి సిటిజన్స్ తీసుకొచ్చారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే సాయన్న సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ ఇటీవలే మంత్రి కేటీఆర్ను కలిసి కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి సరఫరా అమలుతో పాటు పలు అంశాలను ప్రస్తావించామన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి జలమండలి ఎండీతో మాట్లాడి ఉచిత తాగునీటి అమలుపై దృష్టి సారించాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఉచిత తాగునీరు కంటోన్మెంట్లో అమలైతే కాషాయ నేతల ఆటలు సాగవనే ఉద్దేశ్యంతోనే ఉనికిని కాపాడుకోవడానికి నీటి పోరు చేస్తామని కొందరు నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. గల్లీల్లో తిరుగుతూ ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిస్తున్న 15 రాష్ర్టాల్లో అమలు అవుతున్నాయా ప్రశ్నించారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి,షాదీముబారక్, మిషన్ భగీరథ,ఉచిత తాగునీటి పథకాలు బీజీపీ పాలిత రాష్ర్టాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఉన్నాయో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన బకాయిల్లో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని వాళ్లు కూడా నోరు తెరిచి మాట్లాడే సహసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు గా ఆర్మీ నుంచి రావాల్సిన బకాయి నిధులను రప్పించి మాట్లాడాలని హితవు పలికారు.