మెహిదీపట్నం : కార్తీక మాసం వచ్చిందంటే అందరూ లంగర్హౌస్ సంగం జాతర కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కార్వాన్ నియోజకవర్గం లంగర్హౌస్ డివిజన్ బాపూఘాట్ సమీపంలోని చారిత్రాత్మక సంగం శ్రీరామచంద్రజీ మఠం ఆలయంలో ప్రతి సంవత్సరం జాతర ఉంటుంది.
కార్తీక పౌర్ణమి రోజున సంగం రామాలయం వద్ద జరిగే డిప్కి పున్నం జాతరకు నగరం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.ఈ నేపథ్యంలో గురువారం సంగం రామాలయం మఠాధిపతి రాహుల్ దాస్ బాబా రాంలీలా మైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయంలో గురువారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజామున పూజలు ప్రారంభం అవుతాయి. రాత్రి రథం ఊరేగింపు ఉంటుంది.
సంగం వద్ద ముక్తి స్నానాలు..
లంగర్హౌస్ సంగం వద్ద త్రివేణి నదుల సంగమంలో కార్తీక పౌర్ణమి రోజున ప్రజలు ముక్తి స్నానాలను ఆచరిస్తారు. ఈసీ, మూసీ, పెన్గంగా నదుల సంగమంలో కార్తీక స్నానాలను ఆచరించిన అనంతరం గంగకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం సంగం రామాలయంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని పూజలు చేస్తారు.
అనంతరం ఆలయం ఆవరణలోని రాంలీలా మైదానంలో జరిగే జాతర వేడుకలలో పాల్గొని ఇండ్లకు చెరుకు గడలను కొని తీసుకుని వెళ్తారు. ఇదిలా ఉండగా నగరంలోని ధూల్పేట్, ఆసిఫ్నగర్, మంగళ్హాట్, మెహిదీపట్నం, పురానాపూల్, జియాగూడ , నగర శివారుల్లోని బండ్లగూడ, హైదర్షాకోట్, కిస్మత్పూర్, హిమాయత్సాగర్, గండిపేట్, నార్సింగ్, మంచిరేవుల తదితర ప్రాంతాల నుంచి ప్రజలు సంగం జాతరకు వచ్చి వనభోజనాలు చేస్తారు.
సంగం జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కల్గకుండా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.