బాన్సువాడ, జనవరి 7 : కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అర్హులైన ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని నాయకులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి ఆయన మండల ప్రజాప్రతినిధులు, బుడ్మి గ్రామ నాయకులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాన్సువాడలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నాయకులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని, వారు కష్టాల్లో ఉన్న సమయాల్లో దగ్గరుండి న్యాయం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని, నాయకులకు మంచి పేరు వస్తే తనకు వచ్చినట్టేననిఅన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలుచేస్తున్నారని అన్నారు. అమలవుతున్న పథకాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా అందించిన రుణాలు, విద్యుత్ బిల్లుల మాఫీ తదితర అంశాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బుడ్మి గ్రామం లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంపై సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్వన్గా నిలిచిందని తెలిపారు. కాన్ఫరెన్స్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, బుడ్మి సర్పంచ్ నాందేవ్, నాయకులు దొడ్ల వెంకట్రామ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మహ్మద్ ఎజాస్, రవి, జగన్, వెంకట్రామ్ , కో- ఆప్షన్ సభ్యుడు ఖమ్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.