రైతుబంధు సంబురాలు ఊరూరా ఉత్సాహంగా సాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం ఉమ్మడి జిల్లాలో జాతరను తలపించాయి. వ్యవసాయ క్షేత్రాల్లో రైతుబంధు అక్షరాలతో వరి నార్లను పేర్చి అన్నదాతలు సీఎం కేసీఆర్పై అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే వనపర్తి వ్యవసాయ మార్కెట్లో జై రైతుబంధు, జై కేసీఆర్, జై ఎస్ఎన్ఆర్ పేరుతో వేరుశనగ బుడ్డలను పేర్చి కృతజ్ఞతలు తెలిపారు. పలు ప్రాంతాల్లో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం, జలాభిషేకం చేశారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. రైతులకు ఇంత చేసిన ప్రభుత్వానికి వెన్నంటే ఉంటామని స్పష్టం చేశారు. కాగా ఏడో రోజు రైతుబంధు సాయం రూ.31,62,13,780 కర్షకుల ఖాతాల్లో పడింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 9,01,645 మంది రైతుల ఖాతాల్లో రూ.973,13,85,150 కోట్లు జమైంది.
మహబూబ్నగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుబంధుపై అన్నదాతల సంబురం కొనసాగుతున్నది. ఏడో రోజైన బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,416 మంది రైతుల ఖాతాల్లో రూ.31,62,13,780 పంట సాయం జమైంది. దీంతో ఏడు రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,01,645 మంది రైతులకు రూ.973,13,85,150 సాయం అందింది. బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకొని సంబురపడుతున్నారు. కేవలం ఏడు రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తం పంట సాయం అందడంపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వారోత్సవాల్లో రైతులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములవుతున్నారు. రైతుబంధుపై విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు.