ఖైరతాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరిత నిధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. మహారాజ్ అగ్రసేన్ జయంతి మహోత్సవ్ సందర్భంగా అగర్వాల్ సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో ట్రెజర్ హంట్ కార్యక్రమాన్ని ఆదివారం పీవీ నరసింహారావు మార్గ్ పీపుల్స్ప్లాజా లో ప్రారంభించారు.
గో గ్రీన్, గో కరోనా, డ్రైవింగ్ సేఫ్టీ నినాదాలతో నిర్వహించిన ఈ ర్యాలీని మేయర్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ సంక్షోభం మన కాలానికి సంబంధించిన సమస్య అని, కాలుష్యం భూతా పాన్ని పెంచి మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయన్నారు. బాధ్యతగా మొక్కలు నాటడం ద్వారా వాతా వరణ మార్పు కోసం జరిగే పోరాటంలో అందరూ కలిసి రావాలన్నారు. పర్యావరణవేత్తలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద, సామాజిక సంస్థలు, కార్పొరేషన్లు పర్యావరణ సమతుల్యత లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడే రిఫారెస్టేషన్ ప్రయత్నా లు వేగంగా విస్తరించేందుకు సహాయపడాలని కోరారు.
విశ్వనగరం హైదరాబాద్ క్లీన్, గ్రీన్ సిటీగా, రాష్ట్రాన్ని హరితమయంగా మార్చాలన్నది సీఎం సంకల్పమని, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన మహాత్తర ప్రయత్నం హరిత నిధి అన్నారు.ఈ నిధికి ఇచ్చే ప్రతి రూపాయి పర్యావరణ హితంగా చేపట్టే హరిత యజ్ఞానికి వినియోగపడుతుందన్నారు. తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షులు అంజనీ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ తెలంగాణ హరిత నిధి ఏర్పాటును తమ సంస్థ స్వాగతిస్తున్నదన్నారు. అందులో భాగస్వాములమై అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతామన్నారు.
తెలంగాణ హరిత నిధికి లక్ష రూపాయలు విరాళం త్వరలో ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అంకిత్ గుప్తా, ఆశీష్, నవీన్అగర్వాల్, సూర్య కమల్ గుప్తా, సందేశ్ అగర్వాల్, రాల్ సింఘాల్, రితీష్ జిగ్నాని, రింకు అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని సూచిస్తూ కార్ ర్యాలీ
అగర్వాల్ సమాజ్ చేపట్టిన కార్ ర్యాలీ సృజనాత్మకతకు అద్దంపట్టింది. తమ కార్ల డాష్ బోర్డు, పై భాగం, వెనుకబాగంలో పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత,పచ్చదనాన్ని సూచిస్తూ కళారూపాలను ఏర్పాటు చేశారు. సుమారు 123 కార్లతో ఈ ర్యాలీ నిర్వహించారు.