చేగుంట, జనవరి 5 : అర్బన్ పార్కుల ఏర్పాటుతో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి వస్తుందని అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం అర్బన్ పార్కును బుధవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో కాలినడకన పరిశీలించి, చెట్ల పెంపకానికి తీసుకుంటున్న చర్యలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు శరవణన్, హెచ్ఎం డీఏ ఢైరెక్టర్ ప్రభాకర్, మెదక్, సిద్దిపేట డీఎఫ్వోలు రవి ప్రసాద్, శ్రీధర్రావు, డీఆర్డీవో శ్రీనివాస్తో కలిసి అర్బన్ పార్కులో మొక్కలు నాటారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వడియారం, పోలంపల్లి, చందంపేట ఫారెస్ట్ బ్లాక్లోని 528.82 హెక్టార్లలో 2019లో చేపట్టిన ఈ అర్బన్ పార్కులో ఇప్పటి వరకు 2,323 మర్రి, వేప, జువ్వి, నెమలినార, కానుగ, టేకు,వెదురు, మారేడు, అల్లనేరేడు, రోజ్వుడ్, తాని మొక్కలు నాటడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ ఒక్కో అర్బన్ పార్కులో ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి 4,428 మొక్కలు నాటనున్నామని తెలిపారు. వడియారంతోపాటు జిల్లాలోని పరికిబండ, మనోహరాబాద్లో అర్బన్ పార్కుల నిర్మాణం చేపట్టామని, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.