బంజారాహిల్స్ : ఫిలింనగర్ 18 బస్తీల్లో ఆకతాయిల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. రోడ్డుపక్కన పార్కింగ్ చేసిన వాహనాలను ద్వంసం చేయడంతో పాటు చీకటిగా ఉన్న ప్రాంతాల్లో మద్యం సేవిస్తూ రచ్చ చేస్తున్నారు. ఇరుకైన రోడ్లతో పాటు సరైన పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో ఫిలింనగర్లో నివాసం ఉంటున్న వారు తమ బైక్ లను, కార్లను ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో పార్క్ చేస్తుంటారు. దీన్ని అదునుగా చేసుకుని రాత్రిపూట ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.
రాత్రిపూట ఖాళీ ప్రాంతాల్లో కూర్చుని మద్యం సేవించడం. చీకటిగా ఉన్న రోడ్లను అడ్డాగా మార్చుకుని గంజాయి తీసుకోవడం నిత్యకృత్యమయింది. తాజాగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వెనకాల గేటువద్ద పార్క్ చేసిన ఓ కారు అద్దాలను బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు. ఈ మేరకు బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
దీంతో పాటు ఇటీవల కొన్ని పాన్షాపుల్లో, హోటల్స్లో రాత్రిపూట గ్రిల్స్ విరిచేసి చోరీలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.