సికింద్రాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ప్రసిద్ధ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానంలో స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు.
ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ నర్సారెడ్డి ఆధ్వర్యంలో వేకువ జామునుంచే ప్రత్యేక పూజల అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. సుమారు కిలోమీటర్ మేర క్యూలైన్లలో నిల్చున్న భక్తుల రద్దీ సాయంత్రం వరకూ కొనసాగింది.
పెరుమాల్ వెంకటేశ్వర దేవస్థానంతో పాటు బోయిన్పల్లిలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం, రెజిమెంటల్ బజార్లోని పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆదే విధంగా బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్లు కుటుంబసమేతంగా ఉత్తర ద్వారం ద్వారా పలు ఆలయాల్లోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు బోయిన్పల్లిలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీగణేష్ ఫౌండేషన్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ గణేష్ స్వామి వారిని దర్శించు కుని పూజలు నిర్వహించారు.