బంజారాహిల్స్ : అభివృద్ది కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం 14లో రూ.45లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులతో పాటు బీటీ రోడ్డు పనులను శనివారం కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు.
నియోజకవర్గంలో పెండింగ్ అభివృద్ది పనులను పూర్తిచేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అవసరమయ్యే నిధులను మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా రూపొందించిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడంలో సీఎం కేసీఆర్ పాత్ర కూడా ఉందన్నారు.
ఇందిరాపార్కువద్ద ధర్నాలో దేశంలోని రైతుల పక్షాన నిలబడి పోరాటం ప్రారంభిస్తామని హెచ్చరించడంతో కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. ఇదే తరహాలో తెలంగాణలో పండే ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం కొనేదాకా పోరాటం కొనసాగు తుందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో పాటు మాజీ కార్పొరేటర్ భారతీనాయక్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు హాన్, ప్రదాన కార్యదర్శి మాదాస్ ఆనంద్కుమార్, బాబా నాయక్, భీమ్రాజ్, అశ్వక్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.