బంజారాహిల్స్ : మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని మంగళవారం ఖైరతా బాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ముస్లీంలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించడంతో పాటు శాంతి యాత్రలు చేపట్టారు. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా సాంప్రదాయ వస్త్రధారణతో శాంతియాత్రల్లో పాల్గొన్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని మసీదు వద్ద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ జల్సాను ప్రారంభించారు. దేవర కొండబస్తీ, సింగాడకుంట. బంజారాహిల్స్ రోడ్ నెం 12, శ్రీరాంనగర్, బోళాశంకర్ నగర్, కాజానగర్ తదితర ప్రాంతాల్లో జల్సా కొనసాగింది. దారిపొడవునా ఖవ్వాలీలతో పాటు డప్పుల హోరుతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో జల్సాలో పాల్గొనే వారికోసం ప్రత్యేకంగా అన్నదానం ఏర్పాటు చేశారు.
మిలాద్ ఉన్ నబీ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజా గుట్ట, సైఫాబాద్ పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.