ఖమ్మం వ్యవసాయం/ జూలూరుపాడు, జనవరి 5: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి పంటకు సరికొత్త ధర నమోదైంది. బుధవారం జూలూరుపాడు సబ్ మార్కెట్లో క్వింటా రూ.10,200, ఖమ్మం ఏఎంసీలో రూ.10 వేలు పలికి నూతన అధ్యాయాన్ని సృష్టించింది. ఓ వైపు వాడవాడలా రైతుబంధు వారోత్సవాల్లో జరుగుతున్న తరుణంలోనే పత్తి పంటకు రికార్డు ధర పలకడంతో ఎక్కడికక్కడ అన్నదాతలు సీఎం కేసీఆర్కు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేశారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, అజయ్ ఫ్లెక్సీలకు పత్తిపంటతో అభిషేకం చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఖమ్మం ఏఎంసీలో రూ.10 వేలకు పంటకు విక్రయించిన రైతులను మార్కెట్ కమిటీ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు.
రైతుబంధు వారోత్సవాలు, పత్తి పంటకు గరిష్ఠ ధర పలికిన సందర్భంగా బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు, వ్యాపారులు, కార్మికులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. ఉదయం ఆన్లైన్ బిడ్డింగ్లో రికార్డుస్థాయిలో క్వింటాకు రూ.10 వేల ధర పలికింది. దీంతో ఆయా జిల్లాల నుంచి పంటను తెచ్చిన రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో పత్తియార్డులో ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. రైతులతో కలిసి కేక్కట్ చేశారు. ఏఎంసీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకుడు చిరుమామిళ్ల కిరణ్కుమార్, ఇతర అధికారులు కలిసి రైతులకు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయరంగ బలోపేతం కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలే నేడు అద్భుత ఫలితాలనిస్తున్నాయని అన్నారు. రైతుబంధు సాయంతో ధైర్యంగా పంటలు సాగుచేయడం, పత్తి, మిర్చి పంటలకు గరిష్ఠ ధరలు పలుకుతుండడం వంటివి ప్రత్యక్షంగా కన్పిస్తున్నాయన్నారు.
రెండో రోజూ రైతుబంధు వేడుకలు..
ఖమ్మం ఏఎంసీలో రెండో రోజూ రైతుబంధు వేడుకలు ఘనంగా జరిగాయి. రైతులు తాము తెచ్చిన పత్తిపంటతో ‘జై రైతుబంధు, జే కేసీఆర్’ అనే అక్షరమాలను రాసి తమ అభిమానాన్ని, కృతజ్ఞతను చాటుకున్నారు. డీఎంవో నాగరాజు, సెక్రటరీ మల్లేశం, గ్రేడ్టూ అధికారి బజార్, అసిస్టెంట్ సెక్రటరీలు రాజేంద్రప్రసాద్, నిర్మల, పాలకవర్గ సభ్యుడు పత్తిపాక రమేశ్, నాయకులు నున్నా మాధవరావు, మందడపు సుధాకర్ పాల్గొన్నారు.
జూలూరుపాడులో రూ.10,200
జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డులో బుధవారం జెండా పాట రూ.10,200గా నమోదైంది. రాష్ర్టంలోనే అత్యధిక ధర పలికిన సబ్ మార్కెట్ యార్డుగా జూలూరుపాడు రికార్డు సృష్టించింది.
కేసీఆర్ చలువతోనే ఇంత ధర
సీఎం కేసీఆర్ చలువ వల్లనే మా పంటకు ఇంత మంచి ధర పలికింది. ఈ రోజు నేను ఖమ్మం మార్కెట్కు తెచ్చిన పత్తి పంటకు క్వింటాకు రూ.10 వేలు పలికింది. ఇంత ధర పలుకుతోందని సేటు చెప్పగానే నేను నమ్మలేదు. మా చేలల్లో పండిన పంట నాణ్యమైనదంట. ఇతర రాష్ర్టాల్లో మంచి డిమాండ్ ఉంటుందంట. పంటకు పెట్టుబడి, నీటి వసతి, ఉచిత కరెంటు వంటి సౌకర్యాలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించడం వల్లనే నాణ్యమైన పంట వచ్చింది. ఇంతమంచి ధర పలికింది.
‘రైతుబంధు’తో మా అందరికీ బంధువయ్యాడు..
‘రైతుబంధు’తో సీఎం కేసీఆర్ మాలాంటి రైతులందరికీ బంధువయ్యారు. రైతును రాజు చేయాలనే దృఢ సంకల్పంతో పట్టా భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు ద్వారా పంటల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. పండిన పంటలకు మద్దతు ధరనూ కల్పిస్తున్నారు. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. రైతుబంధు ద్వారా సీజన్కు రూ.20 వేల చొప్పున ఏటా రూ.40 వేలు పంటల పెట్టుబడి సాయం అందుతోంది. ఆ పెట్టుబడితోనే పంటలు సాగు చేస్తున్నా.