మణికొండ : నార్సింగి పోలీస్ స్టేషన్లో కరోనా మరోసారి విజృంభించింది. మొదటి వేవ్లోనూ ఇదే తరహాలో సిబ్బందికి కరోనా సోకడంతో ఇబ్బందులను ఎదుర్కొన్న పోలీసులు మరోసారి థర్డ్వేవ్లో కరోనా భారిన పడటం గమనార్హం.
నార్సింగి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలతో పాటు 17 మంది సిబ్బందికి మొత్తం 20 మందికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయిందని వైద్యాధికారులు మంగళవారం తెలిపారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారులను లోపలికి అనుమతించడం తాత్కాలికంగా నిలిపివేశారు.
పోలీస్ స్టేషన్ ఎదురుగా టెంట్లను ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తూ విచారణలు చేపడుతున్నామని నార్సింగి ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా మాస్క్లు ధరించి శానిటైజర్లను వాడాలని ఆయన సూచించారు.
థర్డ్వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్చంధంగా మాస్క్లను ధరించి భౌతికదూరాన్ని పాటిస్తూ అత్యవసరమైతేనే బయటకు రావాలని పోలీసులు కోరుతున్నారు.