
మామిళ్లగూడెం, డిసెంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవో 317 ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న 2,437 మంది పోలీసు కానిస్టేబుళ్లను సీనియారిటీ, ఆప్షన్ల ఆధారంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు కేటాయిస్తూ ఖమ్మం సీపీ విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో బుధవారం ఆదేశాలు జారీ చేసినట్లు అడిషనల్ డీసీపీ (అడ్మిన్) గౌస్ అలమ్ తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న ఏఆర్, సివిల్ పోలీసు ఉద్యోగులు ఏ పరిధిలో పనిచేయాలనుకుంటున్నారో ఆప్షన్తో దరఖాస్తు చేసుకోవాలని అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. దీంతో పోలీసు సిబ్బంది తమ ప్రతిపాదనలు అందజేశారు. ఆప్షన్లను పూర్తిస్థాయిలో పరిశీలించి కలెక్టర్ నేతృత్వంలో జిల్లా కమిటీ పలు దఫాలుగా పోలీస్ శాఖ, పోలీస్ అసోసియేషన్ బృందాలతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆప్షన్లు, సీనియారిటీ ప్రకారంగా పోలీసులను విభజించి ఆయా జిల్లాల పరిధిలో పనిచేసే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్ల విభజన ప్రక్రియ పూర్తి కావడంతో ఆయా జిల్లాలకు కేటాయించినట్లు ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లకు సంక్షిప్త సమాచారం అందించారు. పోలీసు ఉద్యోగులకు కేటాయించిన జిల్లాలో మూడు రోజుల్లోగా (శుక్రవారం లోపు) కచ్చితంగా రిపోర్ట్ చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 2,437 (సివిల్ 1,712, ఏఆర్ 725) మంది పోలీస్ కానిస్టేబుళ్లు ఉండగా ఖమ్మం కమిషనరేట్కు-810 మంది సివిల్ కానిస్టేబుళ్లు, భద్రాద్రి జిల్లాకు-779, మహబూబాబాద్ 44, ములుగు జిల్లాకు 79 మంది కానిస్టేబుళ్లను కేటాయించారు. ఖమ్మం కమిషనరేట్కు 361 మంది, భద్రాద్రి జిల్లాకు 364 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను కేటాయించారు. సివిల్ ఎండ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్సై ఎండ్ ఏఆర్ఎస్సై, ఎస్సైల స్థాయి పోస్టుల విభజన జోన్ల పరిధిలో పరిశీలన జరుగుతోందని ఏడీసీపీ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పోలీస్ కేడర్ సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని వివరించారు.